దేశంలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా సాంకేతిక విద్యార్హతలు కలిగిన యువతకు శుభవార్త. భారతీయ రైల్వే మరోసారి భారీ నియామకాలకోసం సిద్ధమైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి భారీ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది సుమారు 6,180 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కావడం విశేషం. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
టెక్నీషియన్ పోస్టుల విభజన:
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులు 180, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు 6,000 వరకు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియను జూన్ 28వ తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB రీజియన్ల జాబితా (Technician Posts):
ఈ నియామకాలు సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.. ఆర్ఆర్బీ రీజియన్లలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హత & వయో పరిమితి:
2025, జులై 1 నాటికి గ్రేడ్ 1 అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్ 3 అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవల్సిన అర్హతలు, వయోపరిమితితోపాటు ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు వంటి తదితర వివరాలు త్వరలోనే విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలు అందులోనే ఉంటాయి.
Read also: Supreme Court: బుగ్గ మఠం భూములపై పెద్దిరెడ్డికి సుప్రీంలో లభించని ఊరట