ఢిల్లీ సీఎం రేఖా గుప్తా హృద్య విజ్ఞప్తి – రోడ్లపై పశువులకు ఆహారం విసరకండి!
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మరోసారి తన వినయశీలతను, ప్రజల పట్ల ఉన్న శ్రధను చూపిస్తూ ఓ ఆసక్తికర వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఓ వాహనదారుడిని ఎదుర్కొని, చేతులు జోడించి మరీ ఓ సాధారణమైన, కానీ ఎంతో ప్రాధాన్యమున్న అంశంపై విజ్ఞప్తి చేస్తూ కనిపించారు. వీడియోలో కనిపించిన దృశ్యం చదివిన వారిని ఆలోచించేవిధంగా ఉంది. ఒక వ్యక్తి తన కారులో వెళ్తూ, రోడ్డుపక్కన ఉన్న ఓ ఆవుకు రొట్టె విసిరాడు. ఇది చూసిన సీఎం రేఖ గుప్తా వెంటనే తన కాన్వాయ్ను ఆపించి, నేరుగా ఆ వాహనదారుడి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆమె తీరు, మాటల్లో ఉన్న గంభీరత – ఇది కేవలం ప్రభుత్వ అధికారి కాకుండా, బాధ్యత గల పౌరునిగా ఆమె తీరు ఎంత మన్ననీయమైందో చెప్పకర్లేదు.
“ఇది మన సంస్కృతి కాదు.. ఆహారాన్ని గౌరవించండి” – సీఎం సందేశం
ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి తనను తాను ‘నేను ఢిల్లీ సీఎం రేఖ గుప్తా’ అని పరిచయం చేసుకున్న సీఎం, “మీరు ఆ ఆవుకు రోటీ విసిరిన దృశ్యం నేను చూశాను. దయచేసి అలా చేయవద్దు. మన సంస్కృతిలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. దాన్ని రోడ్డుపై విసరడం కరెక్ట్ కాదు. ఆ ఆవు దానికోసం రోడ్డుపైకి వస్తుంది. ఇది ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఇది ఆ ఆవు కోసం కాకుండా, మానవుల ప్రాణాలకు కూడా ప్రమాదమే అవుతుంది” అంటూ చాలా ఉదారంగా, బలమైన అర్థంతో మాట్లాడారు. ఈ మాటల్ని చెబుతుండగా, ఆమె చేతులు జోడించి మరీ ఆ వ్యక్తిని అభ్యర్థించటం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఆమె స్వరంలో కఠినత కన్నా, ప్రేమపూర్వకమైన ఆలోచన ఉన్నది. అది ఒక్క వ్యక్తికి మాత్రమే కాదు – నేడు నగరాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఉండే మెసేజ్.
గోశాలలలో లేదా ప్రత్యేక ప్రదేశాలలోనే జంతువులకు ఆహారం ఇవ్వండి
రేఖా గుప్తా తన వీడియోలో మరొక కీలక అంశాన్ని హైలైట్ చేశారు. “మీరు జంతువులకు ఆహారం ఇవ్వాలనుకుంటే, దయచేసి గోశాలలు లేదా మునిసిపాల్టీ ద్వారా కేటాయించిన ప్రదేశాల్లో ఇవ్వండి. రోడ్లపైకి ఆహారం విసరడం వల్ల వాహనదారులకు ప్రమాదం, పశువుల ప్రాణాలకు ప్రమాదం, చివరికి సమాజానికి కష్టమే,” అని ఆమె తెలిపారు. ఇటీవలే హైదర్పూర్ ఫ్లైఓవర్పై పశువుల గుంపు రోడ్డుపైకి రావడంతో సీఎం కాన్వాయ్ దాదాపు 15 నిమిషాల పాటు ఆగిపోవాల్సి వచ్చిందన్నది మరచిపోలేం. అదే తరహాలో, ఈరోజు కూడా ఆమె చేసిన విజ్ఞప్తి సమాజంలోని పౌరుల బాధ్యతను గుర్తు చేసే అంశంగా మారింది.
ఈ సంఘటన మానవతా దృష్టికోణాన్ని, ఆచార సంప్రదాయాల విలువను, మరియు సమాజం పట్ల మన బాధ్యతను ప్రతిబింబించేలా ఉంది. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి ఇలా రోడ్డుపైనే ఆగి, సామాన్యుడిని ఎదురు చూసి, క్షణంలో బోధిస్తూ అభ్యర్థించడమంటే అది ఎంత పరిపక్వత, వినయం, ప్రజల పట్ల ప్రేమ ఉన్న నేతకు మాత్రమే సాధ్యమవుతుంది.