ఇటీవలే ఇండోర్లో జరిగిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హనీమూన్కు తీసుకెళ్లి మరీ భార్య తన ప్రియుడి కోసం సుపారీ ఇచ్చి రాజాను హత్య చేయించిందన్న అంశం బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, ఇప్పుడు మరో విస్మయకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.హత్య కేసుతో సంబంధం లేనివాడు, కానీ ఈ కేసు పేరును ఉపయోగించి మోసం చేయాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకుని, రాజా కుటుంబాన్ని మభ్యపెట్టడానికి వెళ్లాడు. దీంతో ఈ సంఘటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజస్థాన్లోని రతన్గఢ్కు చెందిన బజరంగ్ లాల్ జాట్ (Bajrang Lal Jat) అనే వ్యక్తి.. పోలీస్ యూనిఫాం ధరించి, భుజంపై మూడు నక్షత్రాల హోదా బ్యాడ్జ్తో రఘువంశీ ఇంటికి వచ్చాడు. తాను రైల్వే పోలీసు అధికారిని అని, రాజాకు మంచి స్నేహితుడినని చెప్పుకున్నాడు.
విషయం గురించి ఫోన్ ద్వారా తెలియజేసింది
రాజా మరణ వార్త విని ఎంతో బాధపడ్డానని, కుటుంబానికి సానుభూతి తెలియజేయడానికి ప్రత్యేకంగా వచ్చానని చెప్పాడు. తన వృత్తిని, రాజా పేరును వాడుకుని ఆ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.అయితే అతని మాటలు, ప్రవర్తనలో ఏదో తేడా ఉందని రాజా తల్లి ఉమా రఘువంశీ (Mother Uma Raghuvanshi) కి అనుమానం కలిగింది. దీంతో ఆమె వెంటనే తన కుమారులు విపిన్, సచిన్లకు ఈ విషయం గురించి ఫోన్ ద్వారా తెలియజేసింది. వారు కూడా వెంటనే అప్రమత్తమై ఇంటికి చేరుకున్నారు. సదరు వ్యక్తిని నిశితంగా పరిశీలించి ప్రశ్నించడం మొదలు పెట్టారు. అప్పుడు కూడా నిందితుడు తాను రైల్వే పోలీసునని.. రాజా కేసు దర్యాప్తులో కూడా చేస్తున్నానని వివరించాడు. దీంతో విపిన్ సిచిన్లు అతడి ఐడీ కార్డు చూపించాలని కోరారు. దాంతో మోసగాడు బజరంగ్ లాల్ కంగారు పడి.. పొంతనలేని సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు.
కుటుంబ సభ్యులకు స్పష్టంగా తెలుసు
రాజా (Raja Raghavamsi) ను గతంలో ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయం వద్ద కోవిడ్ లాక్డౌన్ సమయంలో కలిశానని.. అప్పటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని అతను చెప్పాడు. అయితే రాజా లాక్డౌన్ సమయంలో ఎక్కడికీ వెళ్లలేదని కుటుంబ సభ్యులకు స్పష్టంగా తెలుసు. ఈ అబద్ధమే అతని మోసాన్ని బట్టబయలు చేసింది. వెంటనే విపిన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
మోసానికి పాల్పడాలని
అతడిని విచారించగా, అతను నిజంగానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో కానిస్టేబుల్గా పని చేసేవాడని.. కానీ కొన్ని కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని తేలింది.రాజా రఘువంశీ హత్య గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని, కుటుంబ సభ్యుల భావోద్వేగాలను ఉపయోగించుకుని మోసానికి పాల్పడాలని పథకం వేసుకున్నట్లు అతను ఒప్పుకున్నాడు. అలాగే గతంలోనూ అతడు ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్లు వెల్లడించారు. విపిన్ రఘువంశీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 205 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీస్ వేషం వేసుకుని మోసానికి పాల్పడినందుకు అతడికి కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: