అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో డిమాండ్ చేశారు.”అమెరికా సుంకాలు మన ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి” అని ఆయన అన్నారు. “ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏమి చేయబోతోందో స్పష్టం చేయాలి” అని ఆయన కోరారు.అంతేకాకుండా, రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు వివాదం గురించి కూడా మాట్లాడారు. “చైనా మన భూభాగంలోని 4,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఆక్రమించింది” అని ఆయన ఆరోపించారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజింగ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు నాకు తెలిసింది” అని ఆయన అన్నారు. ఆక్రమిత భూభాగాన్ని త్వరగా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “ఈ విషయం అక్కడి రాయబారి ద్వారా వెలుగులోకి వచ్చింది” అని ఆయన తెలిపారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రతిస్పందించారు.
“ఏ ప్రభుత్వ హయాంలో చైనా ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుందో అందరికీ తెలుసు” అని ఆయన అన్నారు. “డోక్లాం ఘటన జరుగుతున్న సమయంలో బీజింగ్ అధికారులతో కలిసి ఎవరు సూప్ తాగారో కూడా తెలుసు” అని ఠాకూర్ విమర్శించారు. “ఇలాంటి అంశాలను రాజకీయం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు” అని ఆయన అన్నారు. “గతంలో జరిగిన తప్పిదాలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.