2024లో జరిగిన మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికలు సరైన ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా జరగలేదని, బీజేపీ ఐదు దశల “మ్యాచ్ ఫిక్సింగ్” ప్రణాళికతో ముందుగానే ఫలితాలను నియంత్రించిందని ఆయన ఆరోపించారు. “ది ఇండియన్ ఎక్స్ప్రెస్”లో రాసిన వ్యాసంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
బీజేపీ విజయాన్ని చూసి… ప్రశ్నించిన రాహుల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి మొత్తం 288 స్థానాలకు గాను 235 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ మాత్రమే 132 స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. ఇది రాష్ట్ర చరిత్రలోనే బీజేపీకి అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు, కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కేవలం 50 సీట్లకే పరిమితమైంది.
ఐదు దశల రిగ్గింగ్ ఆరోపణలు:
రాహుల్ గాంధీ తన వ్యాసంలో బీజేపీ అనుసరించిన ఐదు దశల వ్యూహాన్ని ఇలా వివరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా తన వ్యాసంలో “ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ను తారుమారు చేయడం, ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, చివరగా సాక్ష్యాలను దాచిపెట్టడం” వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. “ఇది చిన్నపాటి మోసం కాదు, మన జాతీయ సంస్థలను కైవసం చేసుకుని పారిశ్రామిక స్థాయిలో చేసిన రిగ్గింగ్” అని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం కోల్పోవడం ప్రమాదకరం: బీజేపీ కౌంటర్
రాహుల్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజల తీర్పును కించపరుస్తున్నారు. “రాహుల్ గాంధీ దేశంలోని రాజ్యాంగ సంస్థలను కించపరుస్తున్నారు. ఈ సమస్యలపై ఎన్నికల సంఘం ఇప్పటికే వివరంగా స్పందించింది” అని తెలిపారు. తమ పనితీరు స్వతంత్రంగా ఉంటుందని, రాజ్యాంగబద్ధమైన చట్టాలకు కట్టుబడి ఉంటామని ఎన్నికల సంఘం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్ నియామకంపై వివాదం
2023లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామక విధానాన్ని సవరించిన విషయాన్ని రాహుల్ గాంధీ మళ్ళీ ప్రస్తావించారు. ఈ చట్టం ద్వారా, కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చారని, ఇది కార్యనిర్వాహక వర్గానికి అనుకూలంగా ఉందని ఆయన వాదించారు. “ముఖ్యమైన సంస్థలో తటస్థ మధ్యవర్తిని ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది,” అని రాహుల్ రాశారు.
Read also: Eknath Shinde: ఏక్నాథ్ షిండేకు విమానాశ్రయంలో ఊహించని అనుభవం
Ayodhya: అయోధ్య రామ మందిరంలో మేలిమి బంగారంతో కొనసాగుతున్న నిర్మాణ పనులు