దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో చుట్టుపక్కల ఉన్న వాహనాలు, భవనాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన ఉగ్రవాద కుట్రలో భాగమని స్పష్టమవుతోంది. ఈ కేసును మంగళవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. పేలుడుకు బాధ్యుడిగా పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఫరీదాబాద్లో అరెస్టయిన ఉగ్ర మాడ్యూల్తో ఉమర్కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఉమర్ కూడా ఉన్నాడా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అతని తల్లి నుంచి డీఎన్ఏ నమూనా సేకరించారు.
దర్యాప్తు దిశగా సేకరించిన ఆధారాలు ఈ పేలుడు యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని సూచిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న ఐ20 కారులో అమ్మోనియం నైట్రేట్, ఇంధనం, డిటోనేటర్లను ఉపయోగించి పేలుడు జరిపినట్లు అనుమానిస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి మాస్క్ ధరించి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించడం కూడా ఉగ్ర కుట్రకు మరింత బలం చేకూరుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అన్ని కెమెరాల ఫుటేజీలను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. ఈ పేలుడుకు ముందు ఆ కారు మూడు గంటలపాటు సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉందని సమాచారం. దర్యాగంజ్, పహార్గంజ్ పరిసర హోటళ్లు, లాడ్జ్లలో విస్తృత సోదాలు నిర్వహించాయి.
Breaking News – Bihar Election Exit Poll : ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఉమర్ నబీ వ్యక్తిత్వం, నేపథ్యం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పుల్వామా జిల్లా లేత్పొరాకు చెందిన ఈ యువ వైద్యుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధం కలిగి ఉన్నాడు. ఫరీదాబాద్లో అరెస్టయిన ఇతర డాక్టర్ల మాదిరిగానే ఉమర్ కూడా పోలీసులకు దొరికిపోతాననే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే ఉమర్ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన అలాంటి వ్యక్తి కాదని స్పష్టం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచీ చదువుపైనే దృష్టి పెట్టిన మృదువైన స్వభావం ఉన్న యువకుడు అని చెబుతున్నారు. ఈ ఘటన ఉగ్రవాదం కొత్తరూపంలో ముసుగెత్తుతోందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వైద్యవృత్తి ముసుగులో ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్లను దేశవ్యాప్తంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.