పాంబన్ రైల్వే బ్రిడ్జ్, దేశంలో తొలి సముద్రపైన రైల్వే వంతెనగా పేరుగాంచింది. ఇది 100 సంవత్సరాలుగా రామేశ్వరం, తమిళనాడు మధ్య రైలు రాకపోకలకు ఉపయోగపడుతూ వచ్చింది. దీనిలో నౌకలు వచ్చేటప్పుడు రెండు భాగాలుగా వంచి ఓపెన్ అయ్యే ప్రత్యేక వ్యవస్థ ఉండేది. కానీ కాలంతోపాటు దీని లోపాలు బయటపడటంతో, కేంద్రం ఆధునిక వంతెన నిర్మాణానికి ముందుకొచ్చింది.
ప్రధానమంత్రి రామేశ్వరం చేరుకుని పంబన్ బ్రిడ్జిని ప్రారంభించారు రిమోట్ ద్వారా పాంబన్ బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆయన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభించగానే, వంతెన పైకి వెళ్లింది. అదే సమయంలో ఆ వంతెన కింది నుంచి ఇండియన్ కోస్ట్గార్డ్ షిప్ ఆ ప్రాంతాన్ని దాటివెళ్లింది. ప్రపంచంలోనే వండర్ వంతెన ఇది. ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పాంబన్ వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ దేశంలోనే తొలి ఈ రకమైన వంతెన కావడం విశేషం. ఇందులో నౌకలకు దారి ఇవ్వడం కోసం మధ్యభాగాన్ని పైకి లిఫ్ట్ చేసే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు.
కొత్త పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు
- పొడవు- 2.08 కిలోమీటర్లు
- వెర్టికల్ లిఫ్ట్ పొడవు- 72.5 మీటర్లు
- ఎత్తు- లిఫ్ట్ 17 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది
- నిర్మాణ శైలి- స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించబడింది
- కోటింగ్- తుప్పు పట్టకుండా స్పెషల్ కెమికల్ కోటింగ్
- ఖర్చు- రూ.535 కోట్లు
- మరింత సురక్షితమైన నిర్మాణం- భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లగలుగుతాయి
పాంబన్ ప్రాంతం రామాయణ ఇతిహాసంతో కూడా ముడిపడి ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటీ నుంచే శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మించాడు. ఈ ప్రాంతం శ్రీరాముని పాదస్పర్శతో పవిత్రమైన ప్రాంతంగా భావించబడుతుంది. ఇక్కడి ఆలయాలు, తీర్థస్నానాలు భక్తులతో నిండిపోతుంటాయి. అలాంటి ప్రదేశానికి అత్యాధునిక వంతెన రూపంలో కొత్త జీవం రావడం గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, ప్రత్యేకించి సదరన్ రైల్వే పరిధిలో జరిగింది. వందేళ్ల సేవల తరువాత పాత వంతెనను ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మించడం, అది కూడా అత్యాధునిక వెర్టికల్ లిఫ్ట్ సాంకేతికతతో చేయడం భారత రైల్వేల సామర్థ్యానికి నిదర్శనం. ఈ వంతెనతో రామేశ్వరం పర్యాటకానికి ఊతం కలగనుంది. భక్తులు, పర్యాటకులు, మత్స్యకారులు, వ్యాపారదారులు – అందరికీ సులభ, వేగవంతమైన ప్రయాణ మార్గం అందుతుంది. పంబన్ బ్రిడ్జ్ రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్తో కూడి, ఒక దృశ్య కవితగా మారుతుంది. పాంబన్ బ్రిడ్జ్ ఒక వంతెన మాత్రమే కాదు అది భారత సాంకేతిక విజ్ఞానం, ఆధ్యాత్మిక వారసత్వం, పర్యాటకాభివృద్ధి, ప్రజల జీవనశైలిలో మార్పుకి చిహ్నంగా నిలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించబడిన ఈ బ్రిడ్జ్, భవిష్యత్ భారత్ నిర్మాణానికి ఒక మెరుగైన సూచికగా నిలుస్తుంది.
Read also: Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం