విమానయాన చరిత్రలో చేదు రోజును మిగిల్చిన ఎయిర్ ఇండియా 171 ప్రమాదం
విమానయాన చరిత్రలో జూన్ 12, 2025 అనేది ఒక విషాదదినంగా మిగిలిపోయింది. ఎయిర్ ఇండియా 171 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కేవలం కొన్ని సెకన్లలోనే ఉహించని రీతిలో కుప్పకూలడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్లో ప్రయాణించిన 242 మంది ప్రయాణికులలో ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. మిగిలిన 241 మంది దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. జనవాసాలపై విమానం కుప్పకూలిన ఘటన అందరిని కలచివేసింది. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ దీనిని అధికారికంగా ధ్రువీకరించారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత 625 అడుగుల ఎత్తులోకి వెళ్లి, కేవలం కొన్ని క్షణాల్లో 475 అడుగుల వేగంతో కింద పడిపోవడం దారుణాన్ని తలపిస్తోంది. ఇది సాధారణంగా జరిగే విషయం కాదు.
బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్పై భద్రతా సందేహాలు
ఈ ప్రమాదం తరువాత విమానం మోడల్ అయిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్.. గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. అయినా ఇప్పటివరకు ప్రయాణికులను క్షేమంగానే గమ్యస్థానాలకు చేర్చింది. జూన్ 5నుంచి జూన్ 12వరకు అనేకమార్లు లండన్, పారిస్, మెల్బోర్న్, టోక్యోలాంటి ప్రపంచ నగరాలకు ప్రయాణికులను క్షేమంగా చేరవేసింది. జూన్ 5 నుంచి ఇప్పటివరకు 13సార్లు ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్కు ఫ్లై అయింది. అయితే పలుమార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. అసలు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సాంకేతిక సమస్యలతో కలవరపెడుతోంది. కొన్ని నివేదికల ప్రకారం, N819AN రిజిస్ట్రేషన్ కోడ్ కలిగిన డ్రీమ్లైనర్ 25 రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. హైడ్రాలిక్ లీక్లు, సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ అయింది, ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి. జనవరి 7న ఈ విమానం హైడ్రాలిక్ లీక్ కారణంగా మొదటి డైవర్షన్ ఎదుర్కొంది. ఇటీవల, అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన డ్రీమ్లైనర్ ఆమ్స్టర్డామ్లో సాంకేతక సమస్యలతో ఆగిపోయింది.
హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యమే ప్రమాదానికి కారణమా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కావొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, విమానం 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో ఉన్న సమయంలో ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కింద పడిపోవడం సాధారణమైన పరిణామం కాదు. ఇలాంటి లోపాలు సాధారణంగా హైడ్రాలిక్ సమస్యల వలననే వస్తాయని, ఇది అధికారికంగా నిర్ధారించాల్సిన అంశమని విమాన నిపుణులు పేర్కొంటున్నారు. ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు ఇప్పటికే బోయింగ్ 787 మోడల్ పై ఆందోళనలు వ్యక్తం చేశారు. సరైన సమయంలో సమస్యలు పరిష్కరించకపోతే ఈ రకమైన దుర్ఘటనలు మరిన్ని సంభవించవచ్చని వారు హెచ్చరించారు.
టేకాఫ్ ముందు పూర్తి తనిఖీలు చేసినా ఎలా?
ఒక విమానం టేకాఫ్ కావడానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) పక్కా తనిఖీలు చేస్తుంది. ప్రతి మెకానికల్, టెక్నికల్ అంశాన్ని పరిశీలించిన తరువాతే టేకాఫ్కు అనుమతి ఇస్తారు. అలాంటిది టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఇలా ప్రమాదం జరగడం ఆలోచనలోకి కూడా రానిది. ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక మరో కుట్రకోణమా అన్నదానిపై విమానయాన శాఖ మరియు బోయింగ్ సంస్థ తీవ్రమైన దర్యాప్తు ప్రారంభించాయి.
భవిష్యత్ లో విమాన భద్రతపై ప్రభావం
ఈ ఘోరమైన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులలో భయాన్ని పెంచింది. బోయింగ్ 787-8 మోడల్ విమానాలపై ప్రయాణాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికే అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), ఇండియన్ డిజీజీసీఏ (DGCA) బృందాలు ఈ విమాన మోడల్పై సర్వేలు ప్రారంభించాయి. బోయింగ్ సంస్థ కూడా తమ తయారీ ప్రమాణాలపై తిరిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని, ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read also: Israel: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి.. భారతీయులను హెచ్చరించిన ఎంబసీ