భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పహల్గామ్ ఉగ్రదాడి తరువాత నెలకొన్న ఉద్రిక్తతలకు కొంతవరకూ చెక్ పడింది. 19 రోజులుగా సరిహద్దు గ్రామాల్లో కాల్పుల మోతకు తాత్కాలికంగా తెరపడింది. గత రాత్రి నుంచి ఎలాంటి కాల్పుల గానీ, షెల్లింగ్ గానీ జరగలేదని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. గత కొన్ని వారాలుగా నిత్యం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నందున, ఈ శాంతియుత పరిస్థితి సరిహద్దు గ్రామ ప్రజలకు కొంత ఊరట కలిగించింది.
పహల్గామ్ దాడి – ఉద్రిక్తతలకు ఆరంభం
ఏప్రిల్ చివరి వారంలో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పౌరులు మరియు భద్రతా సిబ్బంది మరణించిన ఘటన తాలూకు ప్రభావం ఎల్వోసీ వెంబడి తీవ్రమైంది. దాడికి వెంటనే భారత భద్రతా దళాలు “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారీ నిరోధక చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో అనేక ఉగ్రవాద స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. దీంతో పాటు పాకిస్థాన్ ఆధారిత ఉగ్ర మూలాలు గల ప్రాంతాల్లో భారత భద్రతా దళాల కౌంటర్ చర్యలు పెరిగాయి.
కాల్పుల విరమణ ఒప్పందం – పాక్ వైఖరిలో మార్పు?
ఇటీవల భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఇరు దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దళాలు దాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డాయి. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా గత రాత్రి నుంచి నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల్లోనూ శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని సైన్యం పేర్కొంది.
ప్రజల పరిస్థితి – అప్రమత్తత అవసరం
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి పాకిస్థాన్ సైన్యం ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ దళాలు పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్తో దాడులకు దిగడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో భద్రతా దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కొన్ని రోజులుగా వారంతా తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.
భద్రతా ఏర్పాట్లు –
భారత భద్రతా దళాలు ఎల్వోసీ వెంబడి తమ పర్యవేక్షణను కొనసాగిస్తూ, డ్రోన్ల మార్గదర్శనంతో గగనతల పర్యవేక్షణ, భూభాగంలో మైన్స్ గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా పేలని మోర్టార్ షెల్స్ ఉండే అవకాశం ఉందని, వాటిని గుర్తించి నిర్వీర్యం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో కూడా గత రాత్రి డ్రోన్ల సంచారం, కాల్పులు, లేదా బాంబు దాడులు వంటి ఘటనలేవీ నమోదు కాలేదని సమాచారం. అయినప్పటికీ, భద్రతా దళాలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ ఆచరణపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు, ఉగ్రవాదులకు సహాయం చేసే దేశాలపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తోంది.
Read also: Indian Pilot : మా కస్టడీలో భారత పైలట్ ఎవరూ లేరు – పాక్