తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేశ్ కుమార్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్లకు సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించడంతో, ఈ కేసు మూలాలు ఎక్కడి వరకు వెళ్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.
Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…
ఈ కేసులో నవీన్ చంద్ పాత్రపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. 2016 నుంచి 2020 వరకు నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ బ్యూరో (SIB) చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, నవీన్ చంద్ హయాంలోనే ఆయన కింద పనిచేశారు. ఆ తర్వాతే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాపింగ్ పరికరాల కొనుగోలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను పర్యవేక్షించడం వంటి అంశాల్లో అప్పట్లో ఉన్నతాధికారులకు ఏ మేరకు సమాచారం ఉందనే కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నారు.
మరోవైపు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు నోటీసులు అందడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఆయనకు, ఈ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించి ఏవైనా ఆదేశాలు అందాయా లేదా అన్నది అధికారులు నిర్ధారించుకోనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే కాకుండా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా జరిగిన ఈ వ్యవహారంలో సిట్ సేకరిస్తున్న ఆధారాలు భవిష్యత్తులో మరికొంతమంది కీలక వ్యక్తుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. సజ్జనార్ నేతృత్వంలోని బృందం ఈ కేసును శాస్త్రీయంగా విచారిస్తూ పక్కా ఆధారాల కోసం కసరత్తు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com