ఇటీవల తమిళనాడు(Tamilnadu)లో హిందీ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని సీఎం స్టాలిన్ (CM Stalin)కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు హిందీ వద్దని.. ద్విభాష విధానాన్నే పాటిస్తామని తేల్చిచెప్పారు. ఈ వివాదం కొనసాగుతున్న వేళ.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సీఎం స్టాలిన్ సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని (NEP) ఆవిష్క రించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి కౌంటర్గా ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఆవిష్కరించిన స్టాలిన్ రాష్ట్ర విద్యా విధానం
ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా సూత్రాన్ని తోసిపుచ్చుతూ ద్విభాషా విధానాన్ని రూపొందించారు. ఈ ముసాయిదా పాలసీని తయారుచేసేందుకు 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తమ ప్రతిపాదనలను 2024లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీన్ని పరిశీలించిన స్టాలిన్ ప్రభుత్వం చివరికి కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించింది.
మాతృభాషతో పాటు ఇంగ్లీష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం
మాతృభాషతో పాటు ఇంగ్లీష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైన్స్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించారు. మరోవైపు నీట్ ప్రవేశ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం ఎప్పటినుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ నూతన విద్యా విధానంలో ప్రవేశ పరీక్షకు బదులు మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. 11,12వ తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఆర్ట్స్, సైన్స్ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా ఈ కొత్త పాలసీలో ప్రతిపాదనలు తీసుకొచ్చారు .
తీవ్రంగా వ్యతిరేకంచిన త్రిభాషా విద్యా విధానం
ఇదిలాఉండగా కేంద్రం తీసుకోచ్చిన జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం ఉంది. దీన్ని తమిళనాడు సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపణలు చేశారు. అంతేకాదు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం లేదని సమగ్ర శిక్ష పథకం కింద తమ రాష్ట్రానికి వచ్చే రూ.2,151 కోట్ల నిధులను కేంద్రం ఆపేసినట్లు మండిపడ్డారు. మరోవైపు హిందీ వివాదం మహారాష్ట్రాలో కూడా తీవ్ర వివాదస్పదమైంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: