News Telugu: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) నేత తేజస్వి యాదవ్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారానికి దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే (Milind Narote) ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద తేజస్విపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఆయనపై వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం, పరువునష్టం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు మోపబడ్డాయి.
వివాదాస్పద కార్టూన్
ప్రధాని మోదీ గయ పర్యటనకు ముందురోజు తేజస్వి యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక కార్టూన్ను పంచుకున్నారు. అందులో మోదీని ఒక దుకాణదారుడిగా చూపించి, ఆ దుకాణానికి “ప్రసిద్ధ్ జూమ్లే కీ దుకాణ్” (ప్రసిద్ధ హామీల దుకాణం) అని పేరు పెట్టారు. “ఈరోజు గయలో అబద్ధాల దుకాణం తెరుస్తున్నారు. మీ 11 ఏళ్ల పాలన, ఎన్డీఏ 20 ఏళ్ల పాలనపై లెక్క చెప్పండి” అని కఠిన విమర్శలు చేశారు.
గయ సభలో మోదీ కౌంటర్
ఇక గయలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆర్జేడీ పాలనపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “లాంతరు పాలనలో బీహార్ చీకటిలో మగ్గిపోయింది. గయ వంటి నగరాలు విద్య, ఉపాధి లేక వెనకబడిపోయాయి. ఎన్నో తరాలు వలస వెళ్లాల్సి వచ్చింది” అని మోదీ ఆరోపించారు.
ఎన్నికల ముందు వేడెక్కిన వాతావరణం
ఈ ఘటనలతో బీహార్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అక్టోబర్-నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు తేజస్విపై కేసు నమోదు కావడం ఆర్జేడీ-బీజేపీ మధ్య పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: