చినిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్న పెద్దల మాట నేటికీ అర్థవంతమే. ఆధునిక డిజిటల్ యుగంలో చదవడం తగ్గిందన్న భావనకు భిన్నంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పుస్తక ప్రదర్శనలు(National BookFair) అక్షరానికి ఇంకా ఆదరణ ఉందని చాటి చెబుతున్నాయి. రచయితలు, ప్రచురణకర్తలు, పుస్తకప్రియులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఇవే బుక్ ఫెయిర్లు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ వేడుకలు దేశవ్యాప్తంగా సాహిత్య అభిమానులను ఆకర్షిస్తుంటాయి. ఈ నెల 19 నుంచి హైదరాబాద్లో, ఆ తర్వాత విజయవాడలో పుస్తక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.
Read Also: Jio New Year Plan: “హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

ప్రపంచంలో తొలి పుస్తక ప్రదర్శన చరిత్ర
పుస్తక ప్రదర్శనల చరిత్ర 14వ శతాబ్దానికి చెందినది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో 1462లో తొలి బుక్ ఫెయిర్ నిర్వహించారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. గూటెన్బర్గ్ ఆధునిక ముద్రణ విధానాన్ని పరిచయం చేసిన తర్వాత ఈ ప్రదర్శనకు(National BookFair) మరింత ప్రాచుర్యం లభించింది. నేటికీ ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా గుర్తింపు పొందింది. ఏటా అక్టోబర్లో జరిగే ఈ వేడుకలో సుమారు 100 దేశాల నుంచి 7 వేల మంది ఎగ్జిబిటర్లు, లక్షలాది పుస్తకప్రియులు పాల్గొంటారు. వచ్చే ఏడాది 2026లో అక్టోబర్ 7 నుంచి 11 వరకు ఈ ప్రదర్శన జరగనుంది.
భారత్లో న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ప్రాధాన్యం
భారత్లో రెండో పురాతన పుస్తక ప్రదర్శనగా న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్కు పేరు ఉంది. 1972లో ప్రారంభమైన ఈ ఫెయిర్ను ప్రస్తుతం నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంగ్లిష్ భాషా పుస్తక ప్రదర్శనగా దీనికి గుర్తింపు ఉంది. యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, టర్కీ వంటి అనేక దేశాల ప్రచురణకర్తలు ఇందులో పాల్గొంటారు. 2026 జనవరి 10 నుంచి 18 వరకు ఈ ప్రదర్శన జరగనుంది.
హైదరాబాద్లో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన
తెలంగాణ సాహిత్యాభిమానుల కోసం 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 2025 నుంచి డిసెంబర్ 29, 2025 వరకు 11 రోజుల పాటు తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం (ఇందిరాపార్క్ సమీపంలో) ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 300కు పైగా స్టాళ్లతో రోజూ మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది ప్రాంగణానికి లోకకవి అందెశ్రీ పేరు పెట్టారు.
రికార్డు స్థాయిలో సందర్శకుల అంచనా
గత 38 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తకప్రియులకు ఒక పెద్ద వేదికగా నిలుస్తోంది. గత సంవత్సరం 350కి పైగా స్టాళ్లతో నిర్వహించిన ఈ ప్రదర్శనకు 12 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ భాషల్లో సామాజిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంకేతిక, కాల్పనిక, విద్యా సంబంధిత పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి.
ప్రత్యేక కార్యక్రమాలు, వేదికలు
ఈసారి దివంగత కవులు, రచయితల స్మృతిలో వివిధ విభాగాలకు వారి పేర్లు పెట్టారు. ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపెల్లి వెంకట్ గౌడ్, రచయితల స్టాళ్లకు ఆచార్య ఎస్వీ రామారావు, మీడియా స్టాళ్లకు స్వేచ్ఛా వొటార్కర్ పేర్లు నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో సెకండ్ హ్యాండ్ పుస్తకాల స్టాళ్లకు కూడా అనుమతి ఇచ్చారు.
బాలోత్సవం, పుస్తక స్ఫూర్తి ప్రత్యేక ఆకర్షణ
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ‘బాలోత్సవం’ కార్యక్రమం జరుగుతుంది. పిల్లల్లో సాహిత్య, సాంస్కృతిక ఆసక్తిని పెంపొందించడమే దీని లక్ష్యం. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 6 నుంచి 7 గంటల వరకు ప్రముఖుల అనుభవాల పంచుకోలు ఉంటాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమంలో కవులు, రచయితలు, దర్శకులు, గాయకులు తమ జీవితంపై పుస్తకాల ప్రభావాన్ని ప్రేక్షకులతో పంచుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: