భారత్ – పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం : ప్రజల్లో మిశ్రమ స్పందనలు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సరిహద్దు వెంట సైనిక విభేదాలు పెరిగిన వేళ, అంచనాలకు భిన్నంగా ఇరు దేశాలు అకస్మాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ నిర్ణయాన్ని భారత్ అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చలు మొదలయ్యాయి. పాక్ ద్రోహ చర్యలకు బదులుగా మరింత కఠినంగా వ్యవహరించాల్సిందిగా భావించిన దేశభక్తులు, భద్రతాపరులలో ఒక వర్గం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
“విజయం అంచులదాకా వచ్చి వెనక్కి తగ్గమని?” – నెటిజన్ల ఆవేదన
భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుండి ఉధృతమైన వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. “పాక్ను ఓడించేందుకు భారత్ దూకుడు కొనసాగించి ఉంటే బాగుండేది” అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. “ఇదేం నిర్ణయం?”, “పహల్గామ్లో అమాయకులు చనిపోతే, పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పకుండా వదిలేయాలా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. “పాకిస్థాన్ను ఆక్రమించాల్సింది.. వారిని నాశనం చేయాల్సింది..” అంటూ వినోద్ కౌల్ అనే నెటిజన్ చేసిన వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు, “భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గింది” అనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో స్పష్టంగా వినిపించాయి.
ప్రధాని మోదీపై విమర్శల వెల్లువ
ప్రధాని మోదీ భారత ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలని, ఆయన ప్రధాని అభ్యర్థి అయితేనే ఓటు వేస్తానని కల్పేష్ అనే మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మోదీ తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని విమర్శించాడు. ఈ కాల్పుల విరమణ వల్ల శాశ్వత శాంతి నెలకొంటుందా? అని చాలామంది ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పాకిస్థాన్ వైపు నుంచి మరోమారు చొరబాట్లు జరగవని హామీ ఉంటుందా?, అమాయకులు ప్రాణాలు కోల్పోరని ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలవా? అని సంజీవ్ రంజన్ అనే ఫేస్బుక్ యూజర్ ప్రశ్నించాడు. పహల్గామ్ ఘటన పునరావృతం కాకుండా చూడగలరా? ఆప్తులను కోల్పోయిన వారి గాయాలు మానుతాయా? పర్యాటకులకు భద్రత ఉంటుందా లేక అది రాజకీయ నాయకులకే పరిమితమా? వీటన్నిటికీ సమాధానం అవును అయితే, శాంతికి అర్థం ఉంటుందని అని ప్రశ్నల వర్షం కురిపించాడు. భారత్లో న్యాయం ఎప్పటికీ జరగదని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మోదీ కూడా విఫలమయ్యారని, కాబట్టి భవిష్యత్తులో ఎవరి నుంచి ఏమీ ఆశించలేమని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే, మరికొందరు మాత్రం ఈ కాల్పుల విరమణను స్వాగతించారు.
Read also: India Pakistan War: పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన బీఎస్ఎఫ్ అధికారి మహ్మద్ ఇంతియాజ్