ప్రఖ్యాత సినీ నటుడు, రాజకీయ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన జీవితంలోని అత్యంత గౌరవనీయమైన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్వీకరించడం ఆయన జీవితంలో చారిత్రక ఘట్టంగా నిలిచింది.

సంప్రదాయ వస్త్రధారణలో బాలకృష్ణ ఆకర్షణ
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ సంప్రదాయ తెలుగు పంచెకట్టు వస్త్రధారణతో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా, వినయంతో సభలో చేరిన బాలయ్య బాబు తన చిన్ని చిరునవ్వుతో సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ అవార్డు నాకు గౌరవమే కాకుండా బాధ్యతను కూడా పెంచింది. నా తండ్రి నందమూరి తారకరామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది మరింత శక్తిని అందించనుంది అని ఆయన చెప్పారు.
ఈ అవార్డు నాకు సరైన సమయంలోనే వచ్చింది – బాలకృష్ణ
తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. వరుసగా నేను నటించిన నాలుగు సినిమాలు ఘన విజయం సాధించడం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావడం, ముఖ్యంగా నేను సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో ఈ పురస్కారం రావడం నాకు ఎంతో ప్రత్యేకం అని ఆయన వివరించారు. నందమూరి బాలకృష్ణ చిత్రసీమలో 50 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో అనేకం బ్లాక్బస్టర్ విజయాలు సాధించగా, కొన్ని చిత్రాలు సాంఘిక సందేశాన్ని అందించాయి. అంతేకాదు, ఆయన స్థాపించిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేలాది మందికి వైద్య సహాయం అందించారు. బాలయ్యకు ఈ పురస్కారం లభించడం పట్ల అభిమానులు, తెలుగు ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచీ ఇది మరో అరుదైన గౌరవంగా నిలిచింది.
Read also: Actress: అప్పట్లో నా ఎత్తే నాకు అతిపెద్ద సమస్య : మీనాక్షి చౌదరి