భారత్ లో హిందువుల గురించి తరచుగా ఏదో ఒక వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొన్ని నెలలుగా దేశంలోని, ముఖ్యంగా యూపీ వంటి రాష్ట్రాల్లో కింది కోర్టులు వివిధ మసీదుల సర్వేకు ఆదేశించడం వివాదాస్పదమైంది. హిందువుల్లో ఉన్న రెండు కీలక విశ్వాసాల వల్లే వారు ప్రపంచానికి మేలు చేయలేకపోతున్నారనే అర్దం వచ్చేలా భగవత్ వ్యాఖ్యలు చేసారు. ఈ రెండింటినీ వదిలేసి హిందువులు కలిసిపోతే ప్రపంచానికి మేలు జరుగుతుందంటూ ఆరెస్సెస్ ఛీఫ్ వ్యాఖ్యానించారు.
కేరళలోని పతనంతిట్టలో జరిగిన హిందూ ఏక్తా సమ్మేళన్ లో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసంలో ఆయన హిందువుల్లో ఐక్యత గురించి మరోసారి స్పందించారు. హిందువులంతా కులం, ప్రాంతాలు వదిలిపెట్టి కలిసిపోతే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కులం, మతం, భాషలు వదిలిపెట్టి హిందువులంతా ఏకమైతే ప్రయోజనం ఉంటుందన్నారు. ఏ సమాజం అయినా కలిసి ఉంటే బలపడుతుందని, విడిపోతే కూలిపోతుందన్నారు. ఇంతకు మించి చెప్పడానికి మరో మార్గం లేదన్నారు. చరిత్రే దీనికి సాక్ష్యమని భగవత్ తెలిపారు. ఈ దేశం సంప్రదాయం ఏంటంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ప్రార్ధిస్తుంటారు సామరస్యంతో జీవించడం, నియమాలు, చట్టాలకు కట్టుబడి ఉండటం మాత్రమే అవసరం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఇప్పటికే గత నెలలో మోహన్ భాగవత్ చేసిన స్వాతంత్రం వ్యాఖ్యలపై రచ్చ జరుగుతూనే ఉంది. భారత్ కు నిజమైన స్వాతంత్రం 1947లో రాలేదని, 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక వచ్చిందంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా పార్లమెంట్ లోనూ దుమారం రేగింది. ఇప్పుడు హిందువులంతా కులం, ప్రాంతం, భాష వదిలేసి కలిసిపోవాలంటూ వీటి ప్రభావం తక్కువగా ఉండే కేరళ వంటి రాష్ట్రంలో భగవత్ ఇచ్చిన పిలుపు చర్చనీయాంశమవుతోంది. దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.