తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తమిళ భాషా పరిరక్షణపై తాజా వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, నూతన శిశువులకు పేర్లు పెట్టడంలోనూ, వ్యాపారాలకు నామకరణం చేయడంలోనూ తమిళ భాషకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు స్థానిక సంస్కృతి, భాషా గౌరవం, గుర్తింపు వంటి అంశాల చర్చకు దారితీయడంతో పాటు ప్రధానమంత్రి మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజల ముందుకు తెచ్చాయి.

పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి: సీఎం సూచన
సాంప్రదాయాలను కొనసాగించే మార్గంలో ముఖ్యమైన దశ పేరు పెట్టడమే. స్టాలిన్ మాట్లాడుతూ, “తమిళనాడులో నివసించే మనం, అయినప్పటికీ పిల్లలకు ఉత్తర భారతదేశపు లేదా ఆంగ్ల పేర్లను ఎంచుకుంటున్నాం. ఇది మన భాషా గుర్తింపుకు హానికరం. మన భాషను గౌరవించాలంటే పిల్లలకు స్వచ్ఛమైన, ప్రామాణికమైన తమిళ పేర్లను పెట్టడం మొదలు పెట్టాలి” అని అన్నారు. వివాహాలకు హాజరయ్యే సందర్భాల్లో తాను కాబోయే దంపతులకు తమ బిడ్డకు చక్కటి తమిళ పేరు పెట్టుకోవాలని సూచిస్తుంటానని స్టాలిన్ తెలిపారు.
వ్యాపారాలకు కూడా తమిళ నామకరణం ఇవ్వాలి
పిల్లల పేర్లతో పాటు, ప్రజలు ప్రారంభించే వ్యాపారాలకు కూడా తమిళ పదాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. “మీ వ్యాపారాలు మీ పిల్లలలాంటివే. వాటికి మీరు ఆంగ్ల పేర్లు పెడుతున్నారు. దయచేసి ఆ స్థానంలో తమిళ పదాలను ఉపయోగించండి. ఈ పదాలే ఆ వ్యాపారాల గుర్తింపుగా నిలవాలి. ఎలాగైనా ఆంగ్ల పదం అవసరమైతే కనీసం దాన్ని తమిళ లిపిలో రాయండి,” అని స్పష్టంగా పేర్కొన్నారు.
భాషాపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
తమిళ భాష, అస్తిత్వం గురించి ఇలాంటి అభిప్రాయమే గత నెలలో రామేశ్వరంలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోనూ వ్యక్తమైంది. తమిళనాడు నేతల నుంచి తనకు అందిన లేఖలను ప్రస్తావిస్తూ వారు తమ భాష పట్ల గర్వంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ, ఏ ఒక్క లేఖపైనా తమిళంలో సంతకం లేదని మోదీ అప్పట్లో వ్యాఖ్యానించారు. ‘‘మనం తమిళ భాష పట్ల గర్వంగా ఉంటే, ప్రతి ఒక్కరూ కనీసం తమ పేరును తమిళంలో సంతకం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని ప్రధాని ఆ సందర్భంగా అన్నారు. స్టాలిన్ తాజా విజ్ఞప్తి, మోదీ గత వ్యాఖ్యలు తమిళ భాష ప్రాధాన్యతపై జరుగుతున్న చర్చను ప్రతిబింబిస్తున్నాయి.
Read also: Uttar Pradesh : కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..