పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లా మజీఠా ప్రాంతంలోని నాలుగు గ్రామాలలో కల్తీ మద్యం సేవించిన ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇటుక బట్టీలలో పనిచేసే పేద కార్మికులుగా గుర్తించారు. భంగాలీ, మరారీ కలాన్, థెర్వాల్, పాతల్పురి గ్రామాలకు చెందినవారు బాధితులుగా అధికారులు గుర్తించారు.
కల్తీ మద్యం వెనుక మాఫియా
ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ప్రభ్జిత్ సింగ్ను అరెస్టు చేసినట్లు అమృత్సర్ రూరల్ పోలీసులు వెల్లడించారు. కల్తీ మద్యం సరఫరా వెనుక ప్రభ్జిత్ సింగ్ సూత్రధారి అని తేలిందన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతనితో పాటు మరికొంతమంది కుట్రదారులుగా గుర్తించారు. ప్రభ్జిత్ సింగ్ సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గూ, సాహిబ్ సింగ్ అలియాస్ సరాయ్, గుర్జంత్ సింగ్, జీతా భార్య నిందర్ కౌర్లను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ కల్తీ మద్యం మాఫియాను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు దర్యాప్తును వేగవంతం చేసింది.
దర్యాప్తు
ప్రాథమిక విచారణలో కల్తీ మద్యం బాధితులు ఒకే షాపు నుంచి ఆదివారం సాయంత్రం మద్యం కొనుగోలు చేసినట్లు తేలింది. యంత్రం ఒకే షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు సోమవారమే మరణించగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఆలస్యంగా ఈ మరణాల గురించి సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం నెట్వర్క్పై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గత ఘటనలు – ప్రభుత్వం పై విమర్శలు
ఈ సంఘటన కొత్తది కాదు. పంజాబ్లో కల్తీ మద్యం మరణాలు మార్చి 2024లో సంగ్రూర్లో 24 మంది, 2020లో రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా కల్తీ మద్యానికి బలయ్యారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన ‘యుధ్ నశియాన్ విరుధ్’ కార్యక్రమం సోమవారంతో 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 6,280 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 10,444 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. అయితే, ఈ చర్యలు జరుగుతున్నప్పటికీ, కల్తీ మద్యం మాఫియాల ఆగడాలు ఆగకపోవడం గమనించదగ్గ విషయం.
Read also: Justice Gavai: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ గవాయ్ నియామకం