Latest News: Sarvepalli Radhakrishnan – డాక్టర్ సర్వేపల్లి ఆదర్శ గురువు..నోబెల్‌ బహుమతికి నోచుకోని వైనం

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు చెప్పగానే విద్య, ఆచార్యం, గురుత్వం గుర్తుకొస్తాయి. ఆయన జీవితం మొత్తం ఉపాధ్యాయ వృత్తి, విద్యార్థుల పట్ల ఉన్న మమకారం, జ్ఞానం పంచే తపనతో నిండిపోయింది. ఆయన కేవలం భారతదేశానికే కాదు ప్రపంచ విద్యా వేత్తలకు కూడా స్ఫూర్తిదాయకుడు.1888 సెప్టెంబర్ 5న మద్రాసు సమీపంలోని తిరుత్తణిలో జన్మించిన రాధాకృష్ణన్, (Sarvepalli Radhakrishnan) తెలుగు వాతావరణంలో పెరిగి పెద్దయ్యారు. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యా వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు.

ఆయన తండ్రి సర్వేపల్లి వీరస్వామి తహసీల్దార్‌గా పని చేసేవారు. తల్లి సీతమ్మ గృహిణి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, జ్ఞానం పట్ల ఉన్న ఆరాటం ఆయనను గొప్ప పండితునిగా నిలిపింది. చిన్నతనంలోనే తిరుత్తణి, తిరుపతిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, తత్వశాస్త్రం వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత మద్రాసు క్రిస్టియన్ కాలేజీ లో తత్వశాస్త్రం చదివి, విశేష ప్రతిభ కనబర్చారు.

ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను

ప్రాథమిక విద్యను తిరుత్తణిలో పూర్తి చేసిన రాధాకృష్ణన్.. తిరుపతి, నెల్లూరులో తదనంతర విద్యాభ్యాసం సాగించారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు. 1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు. రాధాకృష్ణన్‌ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు.

ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు.విద్యార్థికి, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణన్. అధ్యాపకుడిగా, వైస్‌ ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితరసాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి.

విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది

సర్వేపల్లి 21 ఏళ్ల వయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం (University of Mysore) ఆయన్ని ప్రొఫెసర్‌గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులనెంతో ఆకట్టుకునేవి.సర్వేపల్లి ప్రతిభ గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్.. కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయణ్ని కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది.

కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్న సమయంలో సర్వేపల్లి ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. ‘మీరు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుని ఉంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది’ అని ఒక మిత్రుడు అనగా.. సర్వేపల్లి ‘నేను ఆక్స్‌ఫర్డ్ వెళ్తే.. అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తా. విద్యార్థిగా మాత్రం కాదు’ అన్నారట. సర్వేపల్లి దేశభక్తి, స్వదేశీ విద్యాలయాలపట్ల గౌరవం, ఆత్మాభిమానానికి ఈ ఘటనను మచ్చుతునకగా పేర్కొంటారు.

Latest News
Latest News

కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రాధాకృష్ణన్

ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు అక్కడికి వెళ్లారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా ఆయనదే.1931లో డా. సి.ఆర్. రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ ‘లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటీ’ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యాపకులుగా పనిచేశారు.

1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14, 15 తేదీ మధ్య రాత్రి ‘స్వాతంత్య్రోదయం’ సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది.1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. భారత్‌కు ఆయనే తొలి ఉప రాష్ట్రపతి.

డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి

ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు సర్వేపల్లి రచించారు.1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యపాశ్చాత్వ తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన ఛలోక్తులు, హాస్యం అందరినీ కట్టి పడేసేవి.

ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించింది.1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో తాత్విక చింతనలో గడిపారు. 1975 ఏప్రిల్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు.

నోబెల్ బహుమతికి నామినేట్ అయిన

సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 27సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. 16సార్లు సాహిత్య విభాగంలో, 11సార్లు శాంతి విభాగంలో ఆయన నోబెల్ పురస్కారం కోసం నామినేట్ అయ్యారు. భారత్ నుంచి అత్యధికంగా నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వ్యక్తిగా సర్వేపల్లి గుర్తింపు పొందారు. ఆ రోజుల్లో అమెరికా, యూరప్ దేశాలకు చెందిన వారికే ఎక్కువగా నోబెల్ కమిటీ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది. ఈ కారణంగానే సర్వేపల్లికి నోబెల్ బహుమతి దక్కలేదని భావిస్తుంటారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/siddaramaiah-muda-case-clean-chit/national/541412/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.