దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయ్. ఈ పెరుగుదలతో పసిడి రేటు జీవితకాల గరిష్ఠాన్ని తాకగా, వెండి ధర కూడా దాదాపు 14 ఏళ్ల తర్వాత అత్యధిక స్థాయిలో నమోదైంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతుండటంతో కొనుగోలు ఒత్తిడి పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడటం వంటివి ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో మంగళవారం ట్రేడింగ్ సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.458 పెరిగి రూ.1,10,047కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర (Silver Price) కూడా కిలోకు గణనీయంగా పెరిగి కొత్త రికార్డును నమోదు చేసింది. దీని వల్ల పెట్టుబడిదారులు, ఆభరణ వ్యాపారులు ఉత్సాహంతో కూడిన వాతావరణంలో ఉన్నారు.
అంతర్జాతీయ ప్రభావం
అమెరికాలో ఆర్థిక సూచికలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ముఖ్యంగా ఉద్యోగాల గణాంకాలు నిరాశపరచడం వల్ల డాలర్ విలువ బలహీనపడింది. ఆగస్టులో 75,000 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారని అంచనా వేయగా వాస్తవానికి కేవలం 22,000 ఉద్యోగాలే నమోదు కావడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీని ప్రభావంతో అమెరికా నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి పెరిగింది. ఫలితంగా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల (Federal Reserve interest rates) ను భారీగా తగ్గించే అవకాశముందని అంచనాలు బలపడాయి. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ మరింత బలహీనమవుతుంది. ఈ పరిణామాలు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరగడానికి దారితీశాయి.
ఆరు వారాల కనిష్ఠానికి పడిపోవడంతో
ఈ పరిణామాలతో డాలర్ ఇండెక్స్ ఆరు వారాల కనిష్ఠానికి పడిపోవడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం, మంగళవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,804గా పలికింది. మరోవైపు, భారత్ లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టులో 233 మిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు వచ్చాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.
సెప్టెంబర్ 17న జరగనున్న అమెరికా ఫెడ్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోత విధించే అవకాశం 91 శాతం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే ద్రవ్యోల్బణ నివేదికలు ఫెడ్ నిర్ణయాన్ని మరింత ప్రభావితం చేయనున్నాయి. టెక్నికల్ గా చూస్తే, బంగారానికి రూ.1,08,040 వద్ద మద్దతు, రూ.1,08,950 వద్ద నిరోధం వున్నాయని మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: