Krishnendu Das: బాలుడిని కొట్టిన దుకాణం యజమాని..అవమానంతో ఆత్మహత్య

Read Time:  1 min
Krishnendu Das: బాలుడిని కొట్టిన దుకాణం యజమాని..అవమానంతో ఆత్మహత్య
FONT SIZE
GET APP

పశ్చిమ బెంగాల్‌(West Bengal) లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా పాన్‌స్కురాలో జరిగిన ఈ విషాదకర సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఏడో తరగతి విద్యార్థి క్రిషెందు దాస్ (Krishendu Das) (12) తను చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని ఆరోపిస్తూ షాపు యజమాని ఓ పన్నెండేళ్ల బాలుడిపై చేయిచేసుకున్నాడు. అందరి ముందూ గుంజీలు తీయించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తల్లి కూడా కొట్టడంతో బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

సంఘటన వివరాలు

క్రిషెందు దాస్, బకుల్డా హై స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. చిప్స్ ప్యాకెట్ కొనేందుకు స్థానికంగా ఉన్న దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్ అక్కడ లేడు. అంకుల్, చిప్స్ తీసుకుంటున్నా అని క్రిషెందు చాలాసార్లు పిలిచినా ఎవరూ సమాధానం ఇవ్వలేదని, దాంతో బాలుడు చిప్స్ ప్యాకెట్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమవుతూ పోలీసులకు తెలిపింది. కొద్దిసేపటికే దుకాణానికి తిరిగొచ్చిన యజమాని దీక్షిత్ బాలుడిని వెంబడించి పట్టుకున్నాడు. అందరి ముందూ క్రిషెందును చెంపదెబ్బ కొట్టి, గుంజీలు తీయించాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బాలుడి తల్లి కూడా అతన్ని మందలించి, కొట్టింది. తాను దుకాణం ముందు పడి ఉన్న కుర్‌కురే ప్యాకెట్‌ను మాత్రమే తీసుకున్నానని, తర్వాత డబ్బులు చెల్లిద్దామనుకున్నానని బాలుడు చెప్పాడు. వెంటనే డబ్బులు చెల్లిస్తానని, క్షమించమని వేడుకున్నా దుకాణదారు నమ్మలేదు, అబద్ధం చెబుతున్నావని నిందించాడు.

అవమానం మరియు ఆత్మహత్య

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన క్రిషెందు, తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, క్రిషెందు నోటి నుంచి నురగలు వస్తూ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

ఆత్మహత్య లేఖ

పక్కనే సగం ఖాళీ అయిన పురుగుల మందు డబ్బా, అతను బెంగాలీలో రాసిన ఓ లేఖ కనిపించాయి. “అమ్మా, నేను దొంగను కాదు. నేను ఏమీ దొంగిలించలేదు. నేను వెళ్లినప్పుడు అంకుల్ (దుకాణదారు) అక్కడ లేడు. తిరిగి వస్తుంటే రోడ్డుపై కుర్‌కురే ప్యాకెట్ కనిపిస్తే తీసుకున్నా. నాకు కుర్‌కురే అంటే చాలా ఇష్టం. ఇవే నా చివరి మాటలు. నన్ను క్షమించు” అని ఆ లేఖలో రాసి ఉంది. క్రిషెందును హుటాహుటిన తమ్లూక్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే బాలుడు మరణించాడు.

పోలీసుల చర్యలు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్ పరారీలో ఉన్నాడు. స్థానికులు మరియు బాలుడి కుటుంబ సభ్యులు, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read also: Muhammad Yunus: రాజీనామా యోచనలో యూనస్- ఆర్మీ ఒత్తిడే కారణమా?

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.