న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పాడెక్స్’ ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లో చేపట్టనున్నది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి 10:15కు గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి లాంచ్ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) సీ-60 రాకెట్ ద్వారా ఎస్డీఎక్స్-01 (ఛేజర్), ఎస్డీఎక్స్-02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నది.
వాటిని దిగువ భూకక్ష్యలో అనుసంధానించేందుకు ప్రయత్నించనున్నది. భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతోపాటు రోదసిలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం ఖగోళ పరిశోధనల్లో ఇస్రో సాధించిన గణనీయ పురోగతికి సూచికగా నిలువనున్నది. విజయంతో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఇస్రో ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
కాగా, స్పాడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ముందుగా రాత్రి 9:58 గంటలకు పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) సీ-60 రాకెట్ ద్వారా ఎస్డీఎక్స్-01 (ఛేజర్), ఎస్డీఎక్స్-02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఈ సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 9:58కి బదులుగా 10:15కు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నది. భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతోపాటు రోదసిలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం ఖగోళ పరిశోధనల్లో ఇస్రో సాధించిన గణనీయ పురోగతికి సూచికగా నిలువనున్నది. విజయంతో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఇస్రో ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. మరోవైపు ఈ నెల 5న ఇస్రో విజయవంతంగా ప్రోబా-3 మిషన్ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత ఈ ఏడాది ఇస్రో చేపట్టబోయే చివరి ప్రయోగం ఇదే.