అస్సాంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించింది. మార్చి 21న జరగాల్సిన 11వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ప్రకటించారు.
పరీక్షలు రద్దు
హయ్యర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 6న ప్రారంభమై మార్చి 29 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, మార్చి 20న జరిగిన గణిత ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల మిగిలిన 36 సబ్జెక్టుల పరీక్షలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి ట్విట్టర్లో వెల్లడించారు. కొత్త షెడ్యూల్పై మార్చి 25న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
అస్సాం బోర్డ్
ఈ లీకేజీ వ్యవహారంలో తీవ్ర చర్యలు తీసుకుంటూ అస్సాం రాష్ట్ర పాఠశాల విద్యా బోర్డు (ఏఎస్ఎస్ఈబి) 10 జిల్లాల్లోని 15 ప్రైవేట్ పాఠశాలల అనుబంధాన్ని సస్పెండ్ చేసింది. లీకేజీకి కారణమైన మరికొన్ని పాఠశాలలపై కూడా చర్యలు చేపట్టింది. 2025-26 విద్యా సంవత్సరానికి 11వ తరగతి అడ్మిషన్లను కూడా నిషేధించింది.

పరీక్షా పత్రాల లీకేజీ
(ఏఎస్ఎస్ఈబి) ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ఇన్-ఛార్జ్ పరీక్షల నియంత్రణాధికారి రంజన్ కుమార్ దాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 20న ప్రశ్నాపత్ర ప్యాకెట్లను ముందే తెరిచినట్లు గుర్తించారు. దీంతో 21న జరగాల్సిన పరీక్షకు ప్రశ్నాపత్రం ముందుగానే బయటికొచ్చింది. కానీ, మిగిలిన పరీక్షల్లో లీకేజీ జరిగిందా అనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని, పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
కేసులు నమోదు
ఈ లీకేజీ ఘటనపై అస్సాం ప్రభుత్వం 18 విద్యాసంస్థలపై కేసులు నమోదు చేసింది. అయితే, లీకేజీ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరిగిందా లేక కొన్ని కేంద్రాల్లో మాత్రమే జరిగిందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. అధికారులు అభిప్రాయపడిన ప్రకారం, ఒకటి లేదా రెండు పరీక్షా కేంద్రాల నుంచే ప్రశ్నాపత్రం లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఉండొచ్చు.ఇది మొదటిసారి కాదు, గత వారం బార్పేట జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అయింది. దీంతో ఆ పరీక్ష కూడా రద్దు చేశారు. తాజాగా 11వ తరగతి మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపిన వివరాల ప్రకారం,పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని తీవ్రంగా పరిగణిస్తున్నాం.లీకేజీలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.లీకేజీ ఘటనలకు పాల్పడే విద్యాసంస్థలు, వ్యక్తులకు కఠిన శిక్షలు ఉంటాయి.నూతన పరీక్షా షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తాం.