ప్రపంచంలోని అత్యాధునిక, అత్యంత సురక్షిత సమాచార మార్పిడి వ్యవస్థగా గుర్తింపు పొందిన క్వాంటమ్ కమ్యూనికేషన్ (Quantum Communication) రంగంలో భారత్ మరో మెట్టు ఎక్కింది. ఢిల్లీ ఐఐటీ, రక్షణ పరిశోధనా సంస్థ DRDO సంయుక్తంగా నిర్వహించిన క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడం భారత్కు తక్కువకాలంలోనే సాంకేతికంగా ముందడుగు వేయడంలో మరో మైలురాయి అయ్యింది.
ఫొటాన్ ఆధారంగా రహస్య సమాచార బదిలీ
క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కాంతి అణువులు (ఫొటాన్లు) ఆధారంగా సమాచారం బదిలీ చేస్తుంది. ఫొటాన్ల ద్వారా పంపే సమాచారం మధ్యలో ఎవరైనా హ్యాక్ చేయాలంటే అది అసాధ్యం. ఒకవేళ ఎవరైనా ప్రయత్నిస్తే ఫొటాన్ల ప్రాపర్టీలు మారిపోతాయి, దాంతో సమాచారం నష్టపోతుంది. అంటే ఇది అత్యంత రహస్యంగా, సురక్షితంగా సమాచార బదిలీకి మార్గం కల్పిస్తుంది. ఇది రక్షణ, సైనిక, అంతరిక్ష, హైసెక్యూరిటీ వ్యవస్థల్లో విప్లవాత్మకంగా మారబోతోంది.
శాస్త్రవేత్తలకు కేంద్రమంత్రి రాజ్నాథ్ అభినందన
ఈ సాంకేతిక విజయాన్ని పురస్కరించుకుని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలపర్చే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపారు. ఈ విజయంతో భారత్ క్వాంటమ్ కమ్యూనికేషన్ను అభివృద్ధి చేసిన అరుదైన దేశాల జాబితాలో చేరింది. భవిష్యత్లో ఇది సైనిక సమాచార మార్పిడిలో కీలక భూమిక వహించనుంది.
Read Also : Air India Plane Crash : విమానం కూలడంపై TATA గ్రూప్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు