ముంబై అంటేనే వేగం, ట్రాఫిక్.. కానీ ఇప్పుడు అదే ముంబై(Mumbai) రోడ్లు పాటలు పాడుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన కోస్టల్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఇప్పుడు ఒక అద్భుతమైన అనుభవం ఎదురవుతోంది. ఇండియాలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. ఈ రోడ్డుపై మీరు నిర్ణీత వేగంతో కారు నడుపుతుంటే.. ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ‘జై హో’ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. మ్యూజికల్ రోడ్ అంటే ఏదో స్పీకర్లు పెట్టి పాటలు ప్లే చేయడం కాదు. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ అద్భుతం. రోడ్డు ఉపరితలంపై నిర్దిష్టమైన లోతు , దూరంలో చిన్న చిన్న గీతలు (Grooves) చెక్కుతారు. వీటినే ‘రంబుల్ స్ట్రిప్స్’ అని కూడా అంటారు. వాహనం ఈ గీతలపై నుంచి వెళ్తున్నప్పుడు టైర్లకు, రోడ్డుకు మధ్య ఏర్పడే ఘర్షణ (Friction) వల్ల ప్రకంపనలు పుడతాయి. ఆ కంపనాల ద్వారా సంగీతం వెలువడుతుంది. హంగేరీ దేశానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముంబైలో దీనిని రూపొందించారు.
Read Also: CM Chandrababu: మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం
500 మీటర్ల మేర ఈ మ్యూజికల్ రోడ్డు
ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్లే కోస్టల్ రోడ్డులో సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజికల్ రోడ్డు ఏర్పాటు చేశారు. దీనిని ధర్మవీర్ స్వరాజ్యరక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ అని పిలుస్తారు. వర్లీ వైపు వెళ్లే టన్నెల్ దాటిన తర్వాత మొదటి లైన్లో ఈ మ్యూజికల్ స్ట్రిప్స్ ఉంటాయి. వాహనదారులు తమ కారును గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో నడిపినప్పుడు మాత్రమే ఆ ‘జై హో’ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. వేగం అంతకంటే తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా ట్యూన్ లయ తప్పుతుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సుమారు రూ. 6.21 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ప్రయాణికులకు బోర్ కొట్టకుండా, సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే డ్రైవర్లు నిర్ణీత వేగాన్ని పాటించేలా ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మ్యూజికల్ రోడ్లు ప్రపంచవ్యాప్తంగా జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా , యూఏఈ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: