టీ20 ప్రపంచకప్ (T20 World Cup champions) గెలిచిన, భారత అంధుల క్రికెట్ జట్టు గురువారం న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. భారత జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆటోగ్రాఫ్స్ చేసిన బ్యాట్ను ఈ సందర్భంగా భారత్ బృందం ప్రధానికి బహుమతిగా అందజేసింది.
Read Also: WPL 2026 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం.. అన్సోల్డ్ జాబితా ఇదే!

దీపిక టి.సి. సారథ్యంలోని భారత జట్టు, ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన ఫులా సరెన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి.

క్రీడాకారిణులకు స్వీట్లు పంచిపెట్టి వారిని సత్కరించారు. మోదీ కూడా ఒక క్రికెట్ బంతిపై సంతకం చేసి వారికి తిరిగి బహుకరించారు. ప్రతి క్రీడాకారిణితోనూ ఆయన ఫోటోలు దిగి, వారి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు, భారత జట్టు విజయంపై ట్విట్టర్ (X) వేదికగా ప్రధాని స్పందించారు. “అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఈ సిరీస్లో అజేయంగా నిలవడం మరింత గర్వకారణం. మీ కఠోర శ్రమ, టీమ్ వర్క్, పట్టుదల భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం” అని మోదీ కొనియాడారు.
ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఇష్టాగోష్ఠిలో దీపిక, పాడేరు యువ క్రికెటర్ కరుణ కుమారి.. మోదీతో మాట్లాడారు. దీపిక పాటలు బాగా పాడుతుందని తెలిసి ఆమెను మోదీ ఒక పాట పాడాలని కోరారు. దాంతో దీపిక శివుని భక్తి గీతం పాడగా.. ఆమెను మోదీ అభినందించారు.
