ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై మరోసారి కఠినమైన వైఖరి తీసుకున్నది. ఇప్పటికే పాక్పై పలు ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ఈ మేరకు కేంద్రం సంబంధిత శాఖలతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఇది అమలవుతే పాక్కు విమాన రవాణా రంగంలో పెద్ద దెబ్బ తగలనుంది.
చైనా లేదా శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి
భారత గగనతలాన్ని వినియోగించకుండా ఆంక్షలు విధిస్తే, పాక్ విమానయాన సంస్థలు మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి వస్తుంది. దీని వల్ల వాటి ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా లేదా శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా పాక్కు భారంగా మారుతుంది. ఇంతకు ముందు 2019లో బాలాకోట్ దాడి అనంతరం కూడా ఇలాంటి ఆంక్షలు విధించడంతో పాక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Read Also : Istanbul Shop Controversy: ఇస్తాంబుల్ దుకాణంలో వివాదాస్పద బోర్డు..డిస్కౌంట్ అడగొద్దు
సముద్ర రవాణాలోనూ పాక్పై ఆంక్షలు విధించే దిశగా భారత్
ఇక, విమాన రవాణా మాత్రమే కాదు, సముద్ర రవాణాలోనూ పాక్పై ఆంక్షలు విధించే దిశగా భారత్ ఆలోచిస్తోంది. పాక్కు చెందిన షిప్పింగ్ సర్వీసులను భారత పోర్టుల్లో ప్రవేశించనీయకుండా నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇది అమలైతే పాక్కు వాణిజ్య రవాణాలో మరో పెద్ద దెబ్బ తగలనుంది. ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశాలకు భారత్ సున్నితంగా లేదని ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతుంది.