పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో భద్రతా లోపాలు, ఉగ్రదాడి పై చర్చ జరిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతాయని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కులగణనను ప్రభుత్వం అంగీకరించడం పట్ల సంతృప్తి
ఈ సమావేశంలో మరో ప్రధాన అంశంగా కులగణనను ప్రభుత్వం అంగీకరించడం పట్ల సంతృప్తి వ్యక్తమైంది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం జరిపితే ప్రభుత్వం తలవంచక తప్పదని రాహుల్ గాంధీ నిరూపించారని ఖర్గే ప్రశంసించారు. అయినప్పటికీ కులగణన ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. కేంద్రం ప్రకటించిన సమయంలోనే అనుమానాలు ఉన్నప్పటికీ, ఈ డిమాండ్కు తలొగ్గడం అనేది ప్రజల విజయమేనని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
ఉగ్రదాడులు పునరావృతం కాకుండా ముందస్తుగా వ్యూహం
కేంద్ర ప్రభుత్వం భద్రతా విషయంలో తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రదాడులు పునరావృతం కాకుండా ముందస్తుగా వ్యూహం సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఖర్గే వ్యాఖ్యానించారు. దేశ భద్రత, ఐక్యతపై రాజీ పడే ప్రసక్తే లేదని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరాటం లోపభూయిష్టంగా కాకుండా సమగ్రంగా ఉండాలని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కేంద్రం కృషి చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Read Also : Indian Cook : కువైట్లో భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలు