హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham) యాత్ర సీజన్లో హెలికాప్టర్ ప్రయాణాలు అనివార్యమవుతున్నాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో, వృద్ధులు, పిల్లలు, శారీరకంగా బలహీనులు ఎక్కువగా హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇటీవల తరుచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో హెలికాప్టర్ సేవల భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

15వ తేదీ ఘోర ప్రమాదం:
కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్తకాశీకి ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్ 15న ఉదయం 5:17 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం తప్పి కూలిపోయింది. కాగా, గత ఆరు వారాల్లో ఉత్తరాఖండ్లో ఇది ఐదో హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash) కావడం గమనార్హం. ఈ తాజా ప్రమాదం తర్వాత, పలువురు ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు ముందుకు వచ్చి, తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరిస్తూ నిర్వహణ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రత్యక్ష సాక్షుల ఆవేదన:
జూన్ 14న హెలికాప్టర్లో ప్రయాణించాలని భావించిన పర్యాటకులు ప్రశాంత్ పాటిల్, రాహుల్ కిరాడ్, డాక్టర్ మేఘనాశర్మ తదితరులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. సహస్త్రధార హెలిప్యాడ్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన తమ విమానం టెక్నికల్ సమస్యల కారణంగా పదేపదే ఆలస్యమై, చివరికి రద్దయిందని తెలిపారు. తమను గుప్తకాశీలో ఉండి, మరుసటి రోజు ఉదయం 4:20 గంటలకు తిరిగి రావాలని సిబ్బంది కోరినట్టు చెప్పారు. అయితే, వారు ఎక్కాల్సిన హెలికాప్టర్ అసలు రాలేదు. తొలుత హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని చెప్పినా, ఆ తర్వాత ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని వారు వాపోయారు.
ప్రతి హెలికాప్టర్లో ఏడుగురు వ్యక్తులను ఎక్కిస్తున్నారని, వారికి ఎలాంటి స్పష్టమైన సమాచారం గానీ, సరైన సాంకేతిక సహాయం గానీ అందించడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. గ్రౌండ్ సిబ్బంది ప్రవర్తన ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన భద్రతా సూచనలు ఇవ్వలేదని, సమన్వయం కొరవడిందని, ప్రయాణ సమయంలో తరచూ తీవ్రమైన కుదుపులకు లోనయ్యామని వారు తెలిపారు. హెలికాప్టర్లో ప్రయాణించడం అంటే ‘ఎగిరే శవపేటికలో’ ప్రయాణించినట్టుగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు కేదార్నాథ్కు బయలుదేరిన తోటి యాత్రికులే ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఉన్నారని తెలిసి తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొన్నారు.
భద్రతా ప్రమాణాలు ప్రశ్నార్థకంగా:
ప్రమాదం జరిగిన తర్వాత వెలుగులోకి వస్తున్న వివరాలు హెలికాప్టర్ సేవల నిర్వహణపై తీవ్ర అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయ లోపం, టేకాఫ్కు ముందు చేపట్టాల్సిన తనిఖీల కొరత వంటి భద్రతా నియమావళి పూర్తిగా విఫలమైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమయానికి సమాచారం ఇవ్వకపోవడం, వాతావరణ పరిస్థితులను బేఖాతరు చేయడం వంటివి తక్షణమే సంస్కరణలు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్లు:
ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు, ఇటీవలి ప్రయాణికులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తక్షణ దర్యాప్తు చేపట్టాలి, ప్రైవేట్ హెలికాప్టర్ సంస్థలపై నియంత్రణ విధించాలి, ప్రతి విమాన సేవకు ముందు టెక్నికల్ క్లియరెన్స్ తప్పనిసరి చేయాలి. గ్రౌండ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. యాత్రా సీజన్లో భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించాలి.
Read also: Seven Hills Express : సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్లో మంటలు..