పాక్ (Pakistan) ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న విస్తృత అటవీ విధ్వంసం (Forest destruction) ఇప్పుడు తీవ్రమైన పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది. టింబర్ మాఫియా, పాక్ సైన్యంలోని కొంతమంది అధికారులు, రాజకీయ పెద్దల అండతో సాగుతున్న ఈ అక్రమ దందా కారణంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు మరింత తీవ్రతరం కావడం వంటి ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ (ఐడీఆర్డబ్ల్యూ) తన తాజా నివేదికలో స్పష్టంచేసింది.ఐడీఆర్డబ్ల్యూ నివేదికలో నీలం లోయకు సంబంధించిన గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాలను ప్రస్తావించింది. ఒకప్పుడు పచ్చదనంతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు నిర్జనంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుగ్నా పెయిన్, నీలం లోయ పరిసర కొండ ప్రాంతాలు చెట్లు నరికివేయడం వల్ల నేల కోతకు గురవుతున్నాయి. ఇవి స్థానిక పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతున్నాయి.
చట్టాల అమలు లోపం, మాఫియా దౌర్జన్యం
పాకిస్థాన్లో అటవీ చట్టాల అమలు సరిగా జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టింబర్ మాఫియా రాజకీయ, సైనిక వర్గాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం వలన ఎలాంటి అడ్డంకులు లేకుండా కలప అక్రమ రవాణా సాగిస్తోంది. దేవదారు, పైన్, సెడార్ వంటి విలువైన చెట్లను నరికి పట్టణ మార్కెట్లకు, విదేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది.దెబ్బతిన్న చెట్లను తొలగించేందుకు రూపొందించిన ‘విండ్ఫాల్ పాలసీ’ను మాఫియా దుర్వినియోగం చేస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ పాలసీని అడ్డుపెట్టుకుని ఆరోగ్యంగా ఉన్న చెట్లను కూడా నరికి తీసుకెళ్తున్నారు. ఫలితంగా అడవుల సమతుల్యత చెడిపోతోంది.
పాక్ సైన్యం భద్రతలో అక్రమ రవాణా
అక్రమ కలప రవాణాకు పాక్ సైన్యం రక్షణ కల్పిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి భద్రత పేరుతో సైన్యం మోహరించి, కలప కాన్వాయ్లకు సాయుధ రక్షణ అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. స్థానికులు నిరసన తెలిపితే వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డేటా ప్రకారం, 2000 నుంచి 2020 మధ్య పీఓకేలో 6 శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం తగ్గింది. నీలం లోయలోనే 15-20 శాతం అడవులు టింబర్ మాఫియాకు బలైపోయినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
ప్రకృతి విపత్తులకు మూలం
ఈ అటవీ విధ్వంసం కారణంగా నేల కోత పెరిగి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం అధికమైంది. 2022లో పాకిస్థాన్లో సంభవించిన భారీ వరదలకు నీలం లోయలో చెట్లు లేకపోవడం కూడా ప్రధాన కారణమని నివేదిక గుర్తు చేసింది.అడవులు నశించడంతో అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. మార్ఖోర్, హిమాలయ నల్ల ఎలుగుబంటి వంటి జాతులు మాయం అవుతున్నాయని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధ్వంసం కొనసాగితే పీఓకే పర్యావరణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read Also :