హోలీ పండుగ రోజున హిమాచల్ ప్రదేశ్లో అశాంతి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్పై దుండగులు దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నలుగురు దుండగులు ఆయుధాలతో ఇంట్లోకి చొరబడి అతనిపై వరుసగా 12 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన బిలాస్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. బంబర్ ఠాకూర్కు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం భద్రతను అందించింది. అయితే, అప్పటికీ ఈ దాడి జరగడం పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంటి సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ కాల్పుల్లో బంబర్ ఠాకూర్తో పాటు ఆయనకు భద్రత కల్పించే పీఎస్ఓ (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) కూడా గాయపడ్డారు. బుల్లెట్ ఠాకూర్ కాలికి తగలడంతో ఆయన తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడిన వారిని బిలాస్పుర్ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఆ తర్వాత బిలాస్పుర్ ఎయిమ్స్కు తరలించారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీరు ఏ కారణంతో దాడి చేశారు? రాజకీయ విరోధితా, వ్యక్తిగత కక్షా లేక మరే ఇతర కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన హిమాచల్ ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాల్పులు జరిపిన వ్యక్తులు ఇంకా పట్టుబడకపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం సహా పలువురు నేతలు ఠాకూర్ను పరామర్శించారు.
పోలీసుల చర్యలు
పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనేది త్వరలోనే వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తతను పెంచింది. నిందితులు త్వరలోనే పట్టుబడతారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయింది.