Gujarat: ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 13 మంది మృతి చెందిన దుర్ఘటన మంగళవారం గుజరాత్ రాష్ట్రం బనస్కంతా జిల్లాలో జరిగింది. బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 13 మంది మృతి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దీసా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కర్మాగారంలో ఈరోజు ఉదయం సంభవించిన పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవడంతో పలువురు కార్మికులు, వారి కుటుంబసభ్యులు కూడా శిథిలాల్లో చిక్కుకుపోయారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాపాడిన కొందరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్యాక్టరీ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడు కారణంగా కర్మాగారంలోని కొంత భాగం కూలిపోయినట్లు ఇన్స్పెక్టర్ విజయ్ చౌదరి తెలిపారు.