భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ క్షిపణి దాడులతో పాకిస్థాన్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థల శిబిరాలపై భారత్ మెరుపుదాడులు చేయడంతో పాక్ ప్రభుత్వం హడలిపోయింది. దాడులు మరింత విస్తరించవచ్చన్న ఆందోళనతో పాకిస్థాన్లోని రావల్పిండి, ఇస్లామాబాద్, బహవల్పూర్ నగరాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నగరాల్లోని ఆసుపత్రుల్లో అత్యవసర ఏర్పాట్లు చేపట్టారు.
వైద్య సిబ్బందికి ఇచ్చిన సెలవులను రద్దు
పాక్ ప్రభుత్వం పరిస్థితిని ఎదుర్కొనడంలో భాగంగా వైద్య సిబ్బందికి ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర సేవలు అలర్ట్ మోడ్లోకి తీసుకురాగా, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను మోహరించింది. ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
విద్యా సంస్థలన్నింటికీ సెలవులు
దాడుల ప్రభావంతో విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించారు. సాధారణ ప్రజల జీవనశైలి దెబ్బతినకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. భారత్ దాడులు కొనసాగిస్తాయన్న భయంతో ప్రభుత్వం ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పాక్లో నెలకొన్న ఈ పరిస్థితి ఆ దేశంపై ఆపరేషన్ సింధూర్ కలిగించిన ప్రభావాన్ని స్పష్టంగా చాటుతోంది.
Read Also : Operation Sindoor : శ్రీనగర్ సహా 5 ఎయిర్ పోర్టులు మూసివేత