Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేసింది. బీఎస్-6 ఇంజిన్ లేని వాహనాలకు ఇకపై ఢిల్లీ నగరంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేసింది. అలాగే, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (PUC) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయబోమని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయం వల్ల గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్ ప్రాంతాల నుంచి రోజూ ఢిల్లీకి వచ్చే దాదాపు 12 లక్షల వాహనాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోయిడా నుంచి నాలుగు లక్షలు, గురుగ్రామ్ నుంచి రెండు లక్షలు, ఘాజియాబాద్ నుంచి సుమారు 5.5 లక్షల వాహనాలకు ఎంట్రీ నిలిపివేయబడుతుంది.
ఈ చర్యలను కఠినంగా అమలు చేయడానికి ఢిల్లీ అంతటా 126 చెక్పోస్టుల వద్ద 580 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. 37 ఎన్ఫోర్స్మెంట్ వాహనాలు రంగంలోకి దింపారు. పెట్రోల్ బంకుల్లో ట్రాన్స్పోర్ట్ శాఖ, మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే అనేక బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేయగా, చెల్లుబాటు అయ్యే PUC లేని వాహనాలను ఇవి గుర్తించనున్నాయి.
Read Also: Sobhita Dhulipala: నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?
శీతాకాలంలో వాహనాల వల్లే PM10 కాలుష్యంలో 19.7 శాతం, PM2.5లో 25.1 శాతం పెరుగుదల జరుగుతోందని అధ్యయనాలు వెల్లడించడంతో (Delhi air pollution) ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం నగరంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-4 అమల్లో ఉంది.
ఇదిలా ఉండగా, కాలుష్యంపై లోక్సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తగా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సాయంత్రం సమాధానం ఇవ్వనున్నారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గత కొన్ని రోజులుగా ‘వెరీ పూర్’ నుంచి ‘సీవియర్’ స్థాయిల మధ్య ఊగిసలాడుతోంది. బుధవారం సాయంత్రం నగర AQI 334గా నమోదైంది.
కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులు నిలిపివేయగా, హైస్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎంపిక ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: