పంజాబ్లోని అమృత్సర్(Amritsar )లో చోటు చేసుకున్న కల్తీ మద్యం (consuming spurious liquor) ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మజితా బ్లాక్లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాల్లోని ప్రజలు మద్యం సేవించిన కొద్ది సమయానికే అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి మొదలైన ఈ విషాద ఘటన మంగళవారం ఉదయానికి తీవ్ర రూపం దాల్చింది. మొదట 14 మంది మృతి చెందగా, తాజాగా మృతుల సంఖ్య 21కి (21 people died)చేరింది. ఇంకా కొంతమందిని ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేర్చారు.
మద్యం తాగిన వారిలో అనారోగ్య లక్షణాలు
పోలీసులు, స్థానిక అధికారులు ఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితులను అమృత్సర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగిన వారిలో అనారోగ్య లక్షణాలు ఉన్నా లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా వారందరినీ పరీక్షలకు లోనుచేశారు. మద్యం తయారీలో మిథనాల్ అనే విషపూరిత రసాయనాన్ని అధికంగా కలపడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. మిథనాల్ తాగినప్పుడు శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు 9 మంది అరెస్ట్
ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ, ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. బాధ్యత లేకుండా ప్రవర్తించిన నలుగురు అధికారులను విధుల నుంచి తొలగించారు. వారిలో డీఎస్పీ, ఎక్సైజ్ మరియు టాక్సేషన్ అధికారులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు కల్తీ మద్యం సేవించవద్దని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.
Read Also : Bellankonda Srinivas : రాంగ్ రూట్లో కారు నడిపిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్