దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. మే నెలాఖరులో గణనీయంగా పెరిగిన కేసులు ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు మూడు రెట్లు పెరగడం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మే 30న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం 2,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే మే 26న యాక్టివ్ కేసుల సంఖ్య 1,010గా ఉన్న సంగతి తెలిసిందే.
రాష్ట్రాల వారీగా కేసులు
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళలో (Kerala) అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. రాజస్థాన్లో 51, ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 చొప్పున యాక్టివ్ కేసులున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో తలా 4 కేసులు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్లలో 3 చొప్పున, మిజోరాం, అసోంలలో రెండేసి ఇన్ఫెక్షన్లు గుర్తించారు. అండమాన్ నికోబార్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్లలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం.
మరణాల గణాంకం
ఈ నెలలో ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు మరణించారు. మహారాష్ట్రలో ఇద్దరు మరణించగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరణించిన వారిలో పంజాబ్కు చెందిన వ్యక్తి మినహా మిగిలిన వారందరూ వయోవృద్ధులని, వారు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారని అధికారులు వివరించారు. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులు తరచూ సబ్బుతో కడగడం లేదా శానిటైజర్ వాడటం.
Read also: Renuka Chowdhury: ఆపరేషన్ సిందూర్ విజయం బీజేపీ ది మాత్రమే కాదు అందరిది:ఎంపీ రేణుక