తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) పెంపు జీవోపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులు పాల్గొననున్నారు. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక నిలుపుదలపై సమగ్ర చర్చ జరగనుంది. బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం ఆగిపోవడంతో పార్టీ, ప్రభుత్వం రెండూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సమావేశంలో ప్రభుత్వం ముందున్న రెండు ప్రత్యామ్నాయాలపై లోతైన చర్చ జరగనుంది. ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మరొకటి హైకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడడం. న్యాయ పరంగా ఏ మార్గం సురక్షితమో తెలుసుకోవడానికి న్యాయ నిపుణుల అభిప్రాయాలను సీఎం రేవంత్ సేకరించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి, ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలను ఆధారంగా తీసుకొని తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ నిర్ణయం సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా ఉందని, దాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరమని మంత్రులు భావిస్తున్నారు.
ఇక బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీయడం పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీసీ సంఘాలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, రిజర్వేషన్ పెంపు నిర్ణయం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ రోజు జరిగే సీఎం రేవంత్ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా హైకోర్టు తీర్పు వరకు వేచి చూడాలా అన్న నిర్ణయమే రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు న్యాయపర వ్యూహానికి దారితీయనుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/