జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల పహల్గాం లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటనను నేపథ్యంగా చేసుకుని, భద్రతాపరమైన పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది దాడి అనంతరం ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కలుసుకున్న తొలి సారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ సుమారు 30 నిమిషాల పాటు కొనసాగిందని సమాచారం.
పర్యాటకుల భద్రతపై ప్రధానంగా చర్చ
పహల్గాం దాడిలో మరణించిన పర్యాటకుల ఘటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాదులపై చేపట్టిన చర్యలపై ఒమర్ అబ్దుల్లా ప్రధానికి వివరించారు. గుర్రాలపై పర్యాటకులను తీసుకెళ్తున్న పోనీవాలా సయ్యద్ అదిల్ హుస్సేన్ షా తాను ప్రాణాలు కోల్పోయి పర్యాటకులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాన్ని సీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని కూడా ప్రధానికి చెప్పారు.
ఉగ్రవాదులపై కఠిన చర్యలు, పాక్కు హెచ్చరిక
పహల్గాం దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేశాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఏప్రిల్ 15 నుంచే పహల్గాంలో సంచరించినట్లు విచారణలో వెల్లడైంది. బైసరన్ లోయ ప్రాంతం వ్యూహాత్మకంగా అనుకూలంగా ఉండటంతో అక్కడే దాడి నిర్వహించినట్లు నిర్ధారణ అయింది. ఉగ్రవాదులకు కొంతమంది స్థానికులు సహకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ దాడికి పాక్ మద్దతు ఉందని గుర్తించిన భారత్, ఆ దేశంపై ఆర్థికంగా కఠిన చర్యలు తీసుకుంది. పాక్కు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేస్తూ భారత్ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది.
Read Also : Rahul Gandhi : రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!