China Manja : సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో గాలిపటాల సందడి పెరుగుతోంది. కానీ ఈ సంబరాల మధ్య చైనా మాంజాలు అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ షాలిబండా పరిధిలోని షంషీర్గంజ్ రోడ్డుపై ఆదివారం బైక్పై వెళ్తున్న వ్యక్తి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో బైక్ అదుపు తప్పడంతో మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి.
ఇదే తరహా ఘటన కొద్ది రోజుల క్రితం మల్లికార్జున నగర్లో చోటుచేసుకుంది. జశ్వంత్ రెడ్డి అనే యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకొని గొంతు తెగిపోయింది. అతడికి 19 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. మరికొంచెం లోతుగా గాయం అయి ఉంటే ప్రాణాలకే ముప్పు ఉండేదని డాక్టర్లు హెచ్చరించారు.
ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో తెలుగురాష్ట్రాల్లో చైనా మాంజాల వల్ల పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బైక్పై వెళ్లేవారికి ఇవి ఉరితాడ్లా మారుతున్నాయి. మనుషులే కాదు, వేల సంఖ్యలో పక్షులు కూడా చైనా మాంజాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి.
చైనా మాంజాలు ఎందుకంత ప్రమాదకరం?
చైనా మాంజాలను నైలాన్, సింథటిక్ దారాలతో తయారు చేస్తారు. వాటిపై గాజు పొడిని పూయడం వల్ల ఇవి చాలా పదునుగా మారుతాయి. ఇతర గాలిపటాల దారాలను కట్ చేయడానికే వీటిని ఉపయోగిస్తారు. అయితే పతంగులు తెగిపోయినప్పుడు ఈ మాంజా దారాలు చెట్లు, బిల్డింగులు లేదా రోడ్లపై వేలాడుతూ బైక్ రైడర్ల మెడకు చుట్టుకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
Read also: Court Verdict: కుల్దీప్ సెంగార్ విడుదలపై సుప్రీంకోర్టు స్టే రద్దు
2016 నుంచే నిషేధం
చైనా మాంజాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని (China Manja) గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016లోనే వీటి అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం చైనా మాంజాలను అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. ఈ చట్టం ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
లోకల్గా తయారీ..?
ప్రస్తుతం చైనా మాంజాలు అక్రమంగా లోకల్లోనే తయారవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నైలాన్, సింథటిక్ దారాలకు గాజు పొడి పూసి గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో విక్రయిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అధిక ధరలకు అమ్ముతూ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది.
పండుగ ఆనందం విషాదంగా మారకుండా ప్రజలు చైనా మాంజాలకు దూరంగా ఉండాలని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: