మన దేశంలో మధ్యతరగతి వాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. పేపర్ మీద జీతం పెరుగుతోంది. కానీ, చేతికి వచ్చేసరికి మాత్రం చిల్లులే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం. నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు ఆకాశాన్ని అంటుతుంటే, మన ట్యాక్స్ స్లాబ్లు మాత్రం అక్కడే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 30 శాతం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ను సవరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత ఆదాయం ఒక పరిమితి దాటితే చాలు.. ఏకంగా 30 శాతం పన్ను(TAX) కట్టాల్సి వస్తోంది. ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం రూ. 24 లక్షల పైన ఉన్న 30 శాతం స్లాబ్ ను కనీసం రూ. 35 లక్షల వరకు పెంచాలి. అప్పుడే మధ్యతరగతి ప్రజల చేతిలో తగినంత డబ్బు మిగులుతుంది.
Read also: SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు
మనం కొనే వస్తువుల ధరలు ప్రతి ఏటా పెరుగుతుంటాయి. కానీ, మన ట్యాక్స్ ఫ్రీ లిమిట్ మాత్రం అలాగే ఉంటుంది. దీనినే ‘బ్రాకెట్ క్రీప్’ (Bracket Creep) అంటారు. అంటే ధరల పెరుగుదల వల్ల మీ జీతం పెరిగినా, రియల్ ఆదాయం పెరగదు. కానీ, మీరు ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తుంది. అందుకే ట్యాక్స్ స్లాబ్లను కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తో లింక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ట్యాక్స్ లిమిట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కేవలం స్లాబ్లు పెంచడమే కాకుండా, హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే మినహాయింపు (Section 24b) పరిమితిని కూడా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం ద్వారా కూడా ఊరటనివ్వవచ్చు. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.