Bombay High Court Judgment: సమాజంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలానికి చరమగీతం పాడుతూ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. బిడ్డ గుర్తింపునకు లేదా సమాజంలో జీవించడానికి తండ్రి పేరు ఉండటం తప్పనిసరి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తల్లి పేరు, కులంతోనే అన్ని హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అత్యాచారం వల్ల జన్మించిన 12 ఏళ్ల బాలిక స్కూల్ రికార్డుల నుంచి ఆమె తండ్రి పేరును పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.
Read Also: Anvesh Instagram Account Ban: అకౌంట్ పోతే పోయింది.. తగ్గేదేలే అంటున్న అన్వేష్!
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన 12 ఏళ్ల కుమార్తె తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జరిగిన అత్యాచారం వల్లే పాప జన్మించిందని, ఆ తర్వాత నిందితుడు 2022లో జరిగిన ఒక సెటిల్మెంట్లో బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చాడని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, స్కూల్ రికార్డుల్లో తండ్రి పేరు, ఆయన కులం (మరాఠా) ఉండటం వల్ల తన కుమార్తె సామాజికంగా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. తన కుమార్తెకు తన కులం వర్తింపజేయాలని కోరారు.
తల్లి సామాజిక హోదానే బిడ్డకు వర్తిస్తుంది
ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒంటరి తల్లిని బిడ్డకు పూర్తిస్థాయి సంరక్షకురాలిగా గుర్తించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అది దయతో చేసే పని కాదని స్పష్టం చేసింది. బాధ్యతలేని తండ్రి కులాన్ని బిడ్డ మోయాల్సిన అవసరం లేదని, తల్లి సామాజిక హోదానే బిడ్డకు వర్తిస్తుందని తేల్చిచెప్పింది. స్కూల్ నిబంధనల పేరుతో ఈ మార్పులు చేయలేమని విద్యాశాఖ అధికారులు చెప్పడాన్ని కోర్టు తోసిపుచ్చింది.
ఈ తీర్పు కేవలం ఒక బాలికకు సంబంధించినది మాత్రమే కాదని.. సమాజంలో ఎంతోమంది ఒంటరి తల్లులు ఎదుర్కొంటున్న గుర్తింపు సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ సంరక్షణలో ఎలాంటి పాత్ర పోషించని తండ్రి పేరును మోయాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పడం ద్వారా స్త్రీ సాధికారతకు, మాతృత్వపు హక్కులకు పెద్దపీట పడిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: