ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ ఘన విజయాన్ని సాధించారు. శుక్రవారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆయన 133 ఓట్లతో గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి మన్దీప్ కేవలం 8 ఓట్లకే పరిమితమయ్యారు. మొత్తం 142 ఓట్లలో ఒక ఓటు చెల్లనిదిగా ప్రకటించబడింది. ఈ విజయంతో గత రెండు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఎంసీడీపై బీజేపీ ఆధిపత్యం సాధించగలిగింది.
ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూరం
అయితే ఈ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించింది. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆ పార్టీ ఆరోపించింది. గత ఏడాది నవంబర్లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్ కుమార్ 3 ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంసీడీలో 250 సీట్లలో బీజేపీకి 117, ఆమ్ ఆద్మీ పార్టీకి 113 సీట్లు ఉన్నాయి. ఇతర కొన్ని సీట్లు ఖాళీగా ఉండటంతో ఈ ఎన్నికలో ఓట్ల మార్పిడి చర్చకు దారి తీసింది.
ఢిల్లీ ప్రజల కష్టాలు తొలగిస్తా – రాజా ఇక్బాల్ సింగ్
మేయర్గా ఎన్నికైన అనంతరం రాజా ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలకు శుభ్రమైన వాతావరణం, నీటి ముంపు సమస్యల పరిష్కారం, చెత్త గుట్టల తొలగింపు, మౌలిక వసతుల కల్పన తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని, నగరాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.