Tushar Gandhi: మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తుషార్ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్ చాలా ప్రమాదకరమైన, కపటత్వం గల శత్రువులని, అవి కేరళలో ప్రవేశించాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదని శుక్రవారం తుషార్ స్పష్టం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని బీజేపీ, ఆరెస్సెస్ డిమాండ్ చేశాయి.
క్షమాపణలు తెలపడం గానీ చేయబోను
ఈ వ్యాఖ్యలకు వెంటనే అక్కడున్న సంఘ్పరివార్, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తుషార్ గాంధీ కారును అడ్డుకోబోయారు. అయితే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం కానీ, క్షమాపణలు తెలపడం గానీ చేయబోనని తుషార్ గాంధీ శుక్రవారం స్పష్టం చేశారు. కొచ్చిలోని అలువలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గాంధీజీ హంతకుడిని సమర్థిస్తున్న వ్యక్తులు మహాత్ముడి విగ్రహం వద్దకు వెళ్లి కాల్పులు జరపగలరు అంటూ దుయ్యబట్టారు.
ఆరెస్సెస్, బీజేపీలపై అనుచిత వ్యాఖ్యలు
మరోవైపు నెయ్యట్టింకరలో శుక్రవారం నిర్వహించిన నిరసనలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత వి.మురళీధరన్ పాల్గొన్నారు. గాంధీజీ కుటుంబ వారసుడిగా చెప్పుకుంటూ ఆ పేరుతో లబ్ధిపొందేందుకు తుషార్ గాంధీ ప్రయత్నిస్తున్నారని మురళీధరన్ విమర్శించారు. ఆరెస్సెస్, బీజేపీలపై అనుచిత వ్యాఖ్యలకు గాను తుషార్ గాంధీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.