Bihar : బీహార్ లో నీట్ పేపర్ లీకేజీ కేసు: ప్రధాన నిందితుడు అరెస్టు
“నీట్ యుజి-2024” ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖీయాను ఆర్థికనేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ రాజధాని పాట్నాలో అరెస్టు చేసినట్లు ఇబయు అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ వెల్లడించారు. పేపర్ లీకేజీ ఘటన బయటపడగానే సంజీవ్ ముఖియా పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు బీహార్ ప్రభుత్వం ఇటీవల రూ. 3 లక్షల నజరానా ప్రకటించింది.అతడి స్థానం సమాచారం ఆధారంగా పాట్నాలోని ఒక అపార్ట్మెంట్లో సంజీవ్ ఉన్నట్లు సమాచారం రావడంతో, అధికారులు అక్కడికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. ముఖియా అరెస్టుతో పేపర్ లీకేజీకి సంబంధించి మరిన్ని వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశముంది.సంజీవ్ ముఖియా నలంద జిల్లా నాగర్సోనా గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు మొదట సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ పేపర్ లీక్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు.

Bihar : సంజీవ్ ముఖియా అరెస్టుతో పేపర్ లీక్ ముఠా గుట్టు రట్టు
తర్వాత, నలందా కాలేజీ నూరసరయ్ బ్రాంచ్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరిన సంజీవ్, నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ప్రధాన వ్యక్తిగా మారాడు. ఈ కేసులో బీహార్ పోలీసులు 14 మందిని అరెస్టు చేసి విచారించినప్పుడు, సంజీవ్ ముఖియా పేరు ప్రధానంగా బయటపడింది.అదే సమయంలో, సంజీవ్ కుమారుడు శివ్కుమార్ కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. అతడిని బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టు చేసి, ప్రస్తుతం జైలులో ఉంచారు. వీరిద్దరూ “ముఖియా సాల్వర్ గ్యాంగ్” పేరుతో ఓ ముఠాను ఏర్పాటుచేసినట్లు తెలిసింది.
Read More : Terrorist : కశ్మీరీ పండిట్లు, రైల్వే ఆస్తులే ఉగ్రమూకల లక్ష్యం!