Bhudaar land ID Telangana : స్థానిక ఎన్నికల తర్వాత 2.3 కోట్ల భూ సర్వేలకు భూదార్ నంబర్లు…

Read Time:  1 min
Bhudaar land ID Telangana
Bhudaar land ID Telangana
FONT SIZE
GET APP

Bhudaar land ID Telangana : స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూదార్ (Bhudaar) భూ గుర్తింపు సంఖ్యలను 2.29 కోట్ల సర్వే నంబర్లకు కేటాయించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, గత BRS ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా ప్రజల సౌకర్యార్థం వ్యవస్థను సమూలంగా మార్పు చేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో మ్యాపులు లేని 413 రెవెన్యూ గ్రామాలను ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో ఐదు గ్రామాల్లో రీ-సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యిందని, సరిహద్దుల వివరాలతో భూ కార్డులు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన 408 గ్రామాల్లో (పట్టణ ప్రాంతాలను మినహాయించి) రెండో దశలో 373 గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడో దశలో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూ కార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Read also: EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం

భూ సంబంధ సమస్యలపై అర్హత కలిగిన దరఖాస్తులను 2026 జనవరి చివరి నాటికి పూర్తిగా పరిష్కరిస్తామని, అనంతరం రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని పొంగులేటి తెలిపారు.

గత BRS ప్రభుత్వ కాలంలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్లు కొనసాగుతున్నాయని, (Bhudaar land ID Telangana) దీనిని క్రమంగా ఇతర జిల్లాలకు విస్తరిస్తామని మంత్రి చెప్పారు. ధరణి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ధరణిలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, తర్వాత మరింతగా నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీన్నింటినీ ఇప్పటికే పరిష్కరించినట్లు చెప్పారు.

రెవెన్యూ సేవలను సరళంగా మార్చడం, పాత భూసమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా విడతల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి జూన్ 20 వరకు అధికారులు గ్రామాల్లో పర్యటించి భూసంబంధ దరఖాస్తులను స్వీకరించగా, మొత్తం 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందరికీ నోటీసులు జారీ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు గ్రామ పాలన అధికారులను నియమించినట్లు తెలిపారు. ఉప రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెట్ల కింద గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ సదుపాయం మూడు దశల్లో రాష్ట్రంలోని 144 ఉప రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని, ఆధార్ ఈ-సిగ్నేచర్ ప్రవేశపెట్టడంతో ప్రజల సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతోందన్నారు. ప్రజల సౌకర్యార్థం కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఉప రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పొంగులేటి స్పష్టం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.