బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గిగ్ వర్కర్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలు పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ నిర్ణయంతో లక్షల మంది డ్రైవర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితిలోకి వెళ్లారు. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) నగరంలోనే సంవత్సరానికి దాదాపు 8 కోట్ల రైడ్లు ఆగిపోయినట్లయ్యాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపనుంది.

బైక్ టాక్సీలపై నిషేధం — ఎందుకు?
కర్ణాటక హైకోర్టు ఇటీవల జారీ చేసిన తీర్పు ప్రకారం, బైకులను కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా వినియోగించవద్దని సిద్ధరామయ్య సర్కారు ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే నేటి నుంచి రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
లక్ష మంది డ్రైవర్లు – జీవనాధారం కోల్పోతున్నారు
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలపై ఆధారపడిన లక్ష మందికి పైగా గిగ్ కార్మికులు బైక్ టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని వారు కుటుంబ పోషణ కోసం రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారని అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది. ఇప్పుడు బ్యాన్ చేస్తే జీవనాధారం లేక వీరంతా రోడ్డు మీదకు వస్తారని లేఖలో పేర్కొంది. ఇది సైడ్ ఆదాయం కాదని ప్రధాన వనరుగా వీరంతా బతుకుతున్నారని నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని లేఖలో నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కోరింది.
సర్కార్కు డ్రైవర్ల విజ్ఞప్తి – లేఖ రాసిన నమ్మ అసోసియేషన్
ఈ పరిస్థితుల్లో నమ్మ అసోసియేషన్ బైక్ టాక్సీ నిషేధాన్ని పునరాలోచించాలని కర్ణాటక ముఖ్యమంత్రిని డ్రైవర్లు కోరారు. నేటి నుండి బైక్ టాక్సీ సేవలపై పూర్తి నిషేధం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీకి లేఖ రాసింది.
ఇతర రాష్ట్రాల్లో లైసెన్సింగ్ – కర్ణాటక ఎందుకు వెనుకబడింది?
తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు బైక్ టాక్సీలపై స్పష్టమైన విధానాలను తీసుకువచ్చాయి. కర్ణాటక ప్రభుత్వం కూడా లైసెన్సింగ్, శిక్షణ, బీమా, భద్రతా ప్రమాణాలపై సరైన నియమాలను తీసుకురావాలని అసోసియేషన్ పేర్కొంది. కాగా స్పష్టమైన విధానం లేనప్పుడు రాపిడో, ఓలా, ఉబర్ మోటో వంటి ప్లాట్ఫామ్ల బైక్ టాక్సీ కార్యకలాపాలను చట్టవిరుద్ధమని ప్రకటించిన గత ఆదేశాన్ని సమర్థిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కోరింది. బెంగుళూరు నగరంలో బైక్ టాక్సీలు సంవత్సరానికి దాదాపు 8 కోట్ల రైడ్లను అందిస్తాయని లేఖలో పేర్కొంది.
కోర్టు తుది మాట – జూన్ 15తో గడువు ముగిసింది
కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీల పిటిషన్లను విచారించిన సందర్భంగా, 2025 ఏప్రిల్లో కర్ణాటక హైకోర్టు బైక్ సేవలను అందించే ఈ కంపెనీలకు జూన్ 15 వరకు బైక్ టాక్సీ సేవలను కొనసాగించడానికి మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఈ ఉపశమనాన్ని పొడిగించడానికి నిరాకరించింది. పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బి.ఎం. శ్యామ్ ప్రసాద్ ధర్మాసనం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం కింద స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేసే వరకు, ఈ సేవలను రాష్ట్రంలో నిర్వహించబోమని పేర్కొంది. నియమాలను రూపొందించడానికి కోర్టు ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇచ్చింది.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డ్రైవర్ల నిరసన మొదలు
ఈ నిర్ణయం నేపథ్యంలో బెంగళూరులోని పలుచోట్ల డ్రైవర్లు నిరసనలు ప్రారంభించారు. బైక్ టాక్సీలు నిషేధించడంలో లాజిక్ లేదని, అవసరమైన నియమాలు తీసుకువచ్చి ఆపద్ధర్మంగా సేవలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Read also: Bangalore: బెంగుళూరులో బైక్ టాక్సీలపై నిషేధంతో.. ప్రయాణికులే పార్సిల్