Bengaluru cafe incident: సాధారణంగా హోటల్కు వెళ్లినప్పుడు బిల్లులో సర్వీస్ ఛార్జ్ లేదా జిఎస్టి ఉండటం సహజం. కానీ, బెంగళూరులోని ఒక ప్రముఖ కేఫ్ మాత్రం కస్టమర్ల నుంచి “గ్యాస్ క్రైసిస్ ఛార్జ్” (Gas Crisis Charge) పేరుతో అదనపు వసూళ్లకు తెరలేపింది. వేడి చేయాల్సిన అవసరం లేని చల్లని పానీయాలపై కూడా గ్యాస్ బిల్లు వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
అసలేం జరిగింది?
ఒక వినియోగదారుడు సదరు కేఫ్లో రెండు గ్లాసుల నిమ్మరసం (Lemonade) ఆర్డర్ చేశారు. దానికి అయిన బిల్లు రూ. 358. అయితే, బిల్లును గమనించిన కస్టమర్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందులో అదనంగా 5 శాతం అంటే రూ. 17లను ‘గ్యాస్ కొరత ఛార్జీ’గా వసూలు చేశారు. నిమ్మరసం తయారు చేయడానికి గ్యాస్తో పనేముందని సదరు కస్టమర్ ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

యాజమాన్యం వాదన ఏంటి?
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాల వల్ల సహజ వాయువు ధరలు పెరిగాయని కేఫ్ యాజమాన్యం పేర్కొంటోంది. ఈ పెరిగిన నిర్వహణ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి మొత్తం బిల్లుపై 5 శాతం అదనపు సెర్ఛార్జ్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. అది వండిన పదార్థమైనా, చల్లని పానీయమైనా సరే.. ఆర్డర్ చేసిన ప్రతి వస్తువుపై ఈ ఛార్జీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
వినియోగదారుల ఆగ్రహం
వంటగ్యాస్తో అస్సలు సంబంధం లేని నిమ్మరసం వంటి పానీయాలపై కూడా ఇలాంటి ఛార్జీలు వసూలు చేయడం వ్యాపార నైతికతకు విరుద్ధమని వినియోగదారుల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
- మెనూలో ఉన్న ధర కంటే అదనంగా ఏ పేరుతోనైనా ఛార్జీలు వసూలు చేయడం చట్టరీత్యా తప్పని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- అనుమతి లేని సెర్ఛార్జీలను హోటళ్లు వసూలు చేస్తే వాటిని ప్రశ్నించే హక్కు కస్టమర్లకు ఉందని వారు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ “గ్యాస్ బిల్లు” ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతుండటంతో, బెంగళూరు మున్సిపల్ అధికారులు మరియు వినియోగదారుల రక్షణ విభాగం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: