భారతీయ రైల్వే శాఖ (Department of Indian Railways) తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. జూలై 1వ తేదీ నుంచి IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇప్పటివరకు పాస్వర్డ్ లేదా ఇతర గుర్తింపు వివరాలతో బుకింగ్ కొనసాగుతున్నా, నూతన నిబంధనల ప్రకారం ప్రయాణికుల అసలైన సమాచారం ధృవీకరించాల్సిన అవసరం ఏర్పడనుంది.
జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP కూడా తప్పనిసరి
ఇది సరిపోదని రైల్వే శాఖ భావించి, జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ కూడా తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. అంటే టికెట్ బుకింగ్ సమయంలో, బుక్ చేస్తున్న ప్రయాణికుడి ఆధార్ నంబర్కు వచ్చిన OTPని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తత్కాల్ టికెట్లకే వర్తించనుండగా, భవిష్యత్తులో సాధారణ రిజర్వేషన్లకూ ఇది వర్తించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు
రైల్వే శాఖ ఈ మార్పులను టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంపునకు, మోసాలు నివారించడానికి తీసుకువచ్చిందని పేర్కొంది. అనేక మంది ఏజెంట్లు నకిలీ ఐడీలతో టికెట్లు బుక్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇది ప్రయాణికుల హక్కులను కాపాడడంలో, న్యాయమైన విధంగా టికెట్లను అందించడంలో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Trump : చైనాతో డీల్ కుదిరింది – ట్రంప్