Maharashtra: మహారాష్ట్ర రాజకీయ ఉద్దండుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar Death) (66) అంతిమ యాత్ర నేడు (గురువారం) ఆయన స్వస్థలమైన బారామతిలో జరగనుంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఉంచారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు.
Read Also: : మృత్యువు ముందుగానే హెచ్చరించిందా?

రాష్ట్రవ్యాప్తంగా సంతాపం – ప్రముఖుల రాక
ఈ అంతిమ సంస్కారాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే బారామతి చేరుకుని నివాళులర్పించారు. అజిత్ పవార్ మృతికి గౌరవ సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 వరకు మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
ప్రమాదంపై వీడని మిస్టరీ
బారామతి విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ కావడానికి కేవలం 60 సెకన్ల ముందు ‘లియర్జెట్ 45’ విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఫ్లైట్ అటెండెంట్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) లోతైన విచారణ ప్రారంభించింది. గతంలోనూ ఇదే రకమైన విమానం ప్రమాదానికి గురవ్వడంతో అధికారులు సాంకేతిక లోపాల కోణంలో ఆరా తీస్తున్నారు.
తీరని లోటు
బారామతి అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన అజిత్ పవార్, తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులను చూశారు. పాలనపై ఆయనకున్న పట్టు, కార్యకర్తలతో ఉన్న అనుబంధం ఆయనను ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: