Air Strikes: అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

Read Time:  1 min
Air Strikes
Air Strikes
FONT SIZE
GET APP

Air Strikes: పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్‌పై ఆకస్మిక వైమానిక దాడులు నిర్వహించి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడులు జరిపింది. ఈ దాడుల్లో 28 మందికి పైగా మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సరిహద్దు వెంబడి ఏడు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్లు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ రెండూ ధృవీకరించాయి.

Read Also: Jammu Kashmir: కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Air Strikes
Air Strikes: Pakistani airstrikes on Afghanistan.. More than 28 people killed

ఇటీవల ఇస్లామాబాద్‌లోని ఓ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్, అఫ్ఘానిస్తాన్ కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తూ వచ్చింది. ఆ ఘటనకు ప్రతీకారంగా ఈ వైమానిక దాడులు చేపట్టినట్లు సమాచారం. పక్తికా, ఖోస్ట్, పక్తియా, నంగర్‌హర్ ప్రావిన్స్‌లలోని టీటీపీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. రంజాన్ మాసంలో మహిళలు, పిల్లలతో సహా పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అఫ్ఘానిస్తాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను దాచేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజం ఈ దాడులను ఖండించాలని భారత్ కోరింది.

మరోవైపు అఫ్ఘానిస్తాన్ ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన అఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ, దేశ సరిహద్దులు, పౌరుల రక్షణ తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసింది. సరిహద్దు ఉల్లంఘనలు కొనసాగితే మౌనంగా ఉండబోమని ప్రకటించింది. ఈ ఘటనలతో పాకిస్తాన్–అఫ్ఘానిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. పరస్పర ఆరోపణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.